ఘాట్ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత.. భయాందోళనలో వాహనదారులు..!
కడప జిల్లాలోని చిట్వేలు-రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోడ్డుపై మళ్ళీ మళ్ళీ చిరుత ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ తక్షణమే స్పందించి పెట్రోలింగ్ పెంచాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి జిల్లా: అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతపులుల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అడవుల గుండా వెళ్లే రహదారులపైకి వన్యప్రాణులు తరచూ వచ్చి దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతమైన చిట్వేలు వద్ద ఉన్న రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతపులి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
రైల్వే కోడూరు పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే చిట్వేలు – రాపూరు ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరమైన సింగిల్ రోడ్డు. సాధారణంగా ఈ మార్గంలో కోతులు, కనుజులు వంటి వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే, గత కొద్దిరోజులుగా ఈ ఘాట్ రోడ్డులో చిరుతపులి తరచూ కనిపిస్తుండటం వాహనదారులను కలవరపెడుతోంది. కొద్దిరోజుల క్రితమే రాత్రి వేళల్లో ఘాట్ రోడ్డు సేఫ్టీ వాల్పై కనిపించిన చిరుత, తాజాగా మళ్లీ అదే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. దాదాపు అరగంట సేపు రక్షణ గోడపైనే కూర్చుని ఉండటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.
అదే ప్రాంతంలో చిరుత మళ్లీ మళ్లీ దర్శనమిస్తుండటంతో రాత్రి సమయాల్లో ఈ ఘాట్ మార్గం ద్వారా ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, చిన్న వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరియు స్థానికులు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఘాట్ రోడ్డులో పెట్రోలింగ్ పెంచాలని, ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
