Secretariat Camps: జులై 1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు.. ఉచితంగా 11 రకాల సర్టిఫికెట్లు
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో జూలై 1 నుంచి ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. అందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో ఎటువంటి ఫీజు వసూలు చేయకుండానే..

అమరావతి: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో జూలై 1 నుంచి ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. అందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో ఎటువంటి ఫీజు వసూలు చేయకుండానే 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం నాలుగు వారాల పాటు నిర్వహిస్తారు. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా సమస్యల పరిష్కారానికి జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారు.
వినతుల స్వీకరణ, రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టులకు వేరువేరు డెస్క్లను ఏర్పాటు చేస్తారు. గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక క్యాంపుల్లో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), ఆదాయ ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్, వివాహ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ), కొత్త రేషన్కార్డు లేదా రేషన్కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు వంటి 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
