AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itlu Mee Niyojakavargam: కైకలూరులో హాట్‌హాట్‌ పాలిటిక్స్‌.. కంచుకోటగా మలుకునేందుకు వైసీపీ వ్యూహం ఇదేనా..

రాజకీయాల్లో ఏ నియోజకవర్గం ప్రత్యేకత దానిదే. ఏపీలో ఆ స్థానం కూడా అలాంటిదే. కాకలు తీరిన నేతలు కాకపోయినా.. ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన వారు సాధారణ నాయకులేం కాదు. అందుకేనేమో, కైకలూరనగానే పొలిటికల్ కహానీ మరో రేంజ్‌లో ఉంటుంది. మరి, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయ్‌?

Itlu Mee Niyojakavargam: కైకలూరులో హాట్‌హాట్‌ పాలిటిక్స్‌.. కంచుకోటగా మలుకునేందుకు వైసీపీ వ్యూహం ఇదేనా..
Kaikaluru Constituency
Sanjay Kasula
|

Updated on: Feb 07, 2023 | 8:56 PM

Share

కైకలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఎపుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. పార్టీలకు అతీతంగా నేతలందరూ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతుంటారు. గెలుపుకోసం పావులు కదుపుతూనే ఉంటారు. అందుకే, అక్కడ ఆ హాటు, ఆ హీటు. మాగంటి, కామినేని మార్క్ రాజకీయం ఒకవైపు నడుస్తుంటే… మరోవైపు వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దూలం… కైకలూరును కంచుకోటగా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ హడావుడి కారణంగా.. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధాన పార్టీలు మధ్య ఉంటుందా..? లేక సామాజిక వర్గాల ప్రభావం ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.

రాజకీయంగా ఘనమైన చరిత్ర కలిగిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో… 1952 నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నియోజకర్గాల పునర్విభజనకు పూర్వం కైకలూరు పరిధిలో కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాలు మాత్రమే ఉండేవి. అయితే, ఆ తర్వాత ముదినేపల్లి మండలం కూడా ఈ నియోజకవర్గంలో కలవడంతో కాస్త పెద్దదైంది. ఇక్కడ పార్టీల వారీగా ట్రాక్‌ రికార్డు చూస్తే.. ఒక్కో విధంగా ఉంటుంది.

కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 9సార్లు గెలవగా… టీడీపీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. 1993 ఉప ఎన్నికల్లో వై.రాజా రామచందర్ టిడిపి నుంచి గెలిచినా.. ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే,1994 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మరో పదిహేనేళ్లు సైకిల్‌కు గెలుపు దక్కలేదు. 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన జయమంగళ వెంకటరమణ.. పూర్తికాలం పదవిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కైకలూరులో ఇండిపెండెంట్లు 3సార్లు, బిజెపి ఒకసారి విజయం సాధించాయి. 2014లో టీడీపీతో పొత్తులో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన కామినేని శ్రీనివాస్‌… చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పనిశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో… రకరకాల మార్పులు జరిగాయ్‌ అది వేరే విషయం. ఇక, 2019లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన దూలం నాగేశ్వరరావు .. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మరోసారి ప్రజల దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

గణాంకాల ప్రకారం కైకలూరు నియోజకవర్గంలో… రెండు లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వీరిలో కాపులు, బి.సిలు, యస్సీ సామాజిక వర్గ జనాభే అధికంగా ఉంటుంది. ఇక్కడ జయాపజయాలను సైతం వాళ్లే నిర్దేశించే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేసారి ఫలితం ఉంటుందనేది.. వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొల్లేరు ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటం మరో విశేషం. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్నాయి కాబట్టే కైకలూరు నియోజకవర్గంలో ఏపీ రాజకీయాల్లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం