Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్ ఇచ్చిన రాజమండ్రి కోర్టు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత..
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు, ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మే 19న జరిగిన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడనే విషయం తెలిసిందే. సుబ్రమణ్యం మర్డర్ జరిగిన తర్వాత అనంతబాబును అరెస్టు చేయాలని, ప్రతిపక్షాలు, వివిధ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ హత్య విషయంలో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అంతబాబును అరెస్టు చేసేంతవరకు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా అతని కుటుంబసభ్యులు నిరాకరించారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసే క్రమంలో, అనూహ్యంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు అనంతబాబు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదిక కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. మరణానికి ముందే డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు వైద్యులు. ఇలా అనేక సంచలనాలకు ఈ మర్డర్ కేసు కేంద్ర బిందువుగా మారింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే, అనంతబాబు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై గతంలో రెండుసార్లు విచారణ వాయిదా వేసిన కోర్టు, తాజాగా బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.