Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా.. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త..!
Andhra Pradesh: ఏపీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెతో నగరాలు, పట్టణాలు కంపుకొడుతున్నాయ్.
Andhra Pradesh: ఏపీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెతో నగరాలు, పట్టణాలు కంపుకొడుతున్నాయ్. సేమ్ టైమ్, ఆందోళనలతో దద్దరిల్లిపోతున్నాయ్ మున్సిపాలిటీలు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయ్. స్టేట్వైడ్గా సుమారు 35వేల మంది కార్మికులు విధులు బహిష్కరించడంతో చెత్త సేకరణ నిలిచిపోయింది. అసలే, వర్షాకాలం, మరోవైపు జోరువానలతో అంతంతమాత్రంగా ఉండే పారిశుద్ధ్యం, సమ్మె కారణంగా మరింత అధ్వాన్నంగా తయారైంది. పీఆర్సీ అమలు, వేతనాల పెంపు, ఆదివారం సెలవు లాంటి 9 డిమాండ్లతో సమ్మెకు దిగారు మున్సిపల్ కార్మికులు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో సుమారు 35వేల మంది కార్మికులు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
మున్సిపల్ కార్మికులంతా ఏకతాటిపైకి రావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి కంపుకొడుతున్నాయ్ మున్సిపాలిటీలు. గుంటూరు, విశాఖలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయ్. గుంటూరు కార్పొరేషన్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతుండటంతో నగరమంతా దుర్గంధం వస్తోంది. ఒక్క గుంటూరులోనే రెండు వేల మంది కార్మికులు విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా తయారైంది. స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కూడా నిలిపిపోవడంతో రాత్రిపూట చీకటిమయంగా మారింది గుంటూరు నగరం.
ఇక, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు కార్మికులు. ఎన్నికల హామీ మేరకు మున్సిపల్ వర్కర్లను పర్మినెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు. విశాఖలో మున్సిపల్ కార్మికుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, అరెస్టులకు దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు పోలీసులు.