AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat waves: ఎండల తీవ్రతతో ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశం.. స్కూళ్లలో తప్పనిసరిగా మూడుసార్లు వాటర్‌ బెల్‌

ఏడాది ఏడాదికి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే భానుడు మండిపోతున్నాడు. ఎండలు దంచికొడుతుండడంతో స్కూళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎండల తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ బెల్స్‌ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది

Heat waves: ఎండల తీవ్రతతో ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశం.. స్కూళ్లలో తప్పనిసరిగా మూడుసార్లు వాటర్‌ బెల్‌
Heat Waves In Ap
Surya Kala
|

Updated on: Apr 03, 2024 | 9:04 AM

Share

ఏప్రిల్ వ‌చ్చేసింది.. ఎండ‌లు మండిపోతున్నాయి. అందులో.. కొద్ది రోజుల నుంచి సూర్యుడు భగభగలాడుతున్నాడు. బయటకెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అటు.. వేస‌వి కావ‌డంతో ప్రస్తుతం ఒంటిపూట బ‌డులు న‌డుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పిల్లలు హ‌డావుడిగా స్కూళ్లకు ప‌రుగులు పెడుతున్నారు. దాంతో.. విద్యార్థులు డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఏపీ విద్యాశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్‌ బెల్స్‌ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు బెల్స్‌ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.45, 10.50, 11.50కి గంట కొట్టాలని పేర్కొంది. బెల్‌ మోగించిన వెంటనే విద్యార్థులు మంచినీళ్లు తాగేలా చూడాలని కూడా విద్యాశాఖ సూచించింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగానే 5 నిమిషాల పాటు వాటర్‌ బ్రేక్‌ కూడా ఇవ్వనున్నారు.

ఇక.. 2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని బడుల్లో ప్రారంభించారు. అక్కడ మంచి స్పందన రావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా వాటర్‌ బెల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎండల తీవ్రత కారణంగా ఏపీలోనూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో తప్పనిసరిగా మూడు సార్లు వాటర్‌ బెల్‌ కొట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే.. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగానే ఉంటున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..