Guntur Nonstop Cremations: గుంటూరులో ఆరని చితులు.. ఆర్తనాదాలు.. ఎటుచూసినా కాలుతున్న మృతదేహాలే..!
కోవిడ్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. గుంటూరులో శ్మశానవాటికలో బుధవారం ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపించాయి.
Guntur Nonstop Cremations: దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. దీంతో అధికారులు చేతులేత్తేస్తున్నారు. కరోనా లక్షణాలతో వస్తున్నవారందరికి పరీక్షలు చెయ్యడం అధికారుల వల్లకావడం లేదు. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి.
కరోనా మృత్యుకేకలు రాష్ట్రంలోని శ్మశానవాటికల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బొంగరాలబీడు శ్మశానవాటిక బుధవారం ఈ వాటికను సందర్శించినవారికి ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపించాయి. వాటిలో ఎక్కువగా కరోనా మృతదేహాలే ఉండటం కలవరపెడుతోంది. మంగళవారం ఈ శ్మశానవాటికలో 51 శవాలకు దహన సంస్కారాలు జరిగాయి. గత నాలుగు రోజుల వ్యవధిలో వందకుపై అంత్యక్రియలు జరిగాయి. సాధారణ రోజుల్లో ఈ శ్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 18న 26 మృతదేహాలు,19న 23 మృతదేహాలకు, ఈనెల 20 మంగళవారం రోజున 40, బుధవారం 52 మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అందులో 35 మంది కరోనాతో మృతి చెందినవారే.
గుంటూరు నగరంలోనే ఉన్న కొరిటపాడు శ్మశానవాటిక సైతం శవాల గుట్టలతో నిండిపోయింది. ఇక్కడ ఈ నాలుగురోజుల్లో 50కు పైగా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగాయి. అదే విధంగా స్తంభాలగరువులోని శ్మశానవాటికకూ తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడ 20 వరకు కరోనా మృతదేహాలకు గత నాలుగు రోజుల్లో అంతిమ సంస్కారాలు జరిగాయి. కరోనా బారిన పడి మృతి చెందిన వారికి కుటుంబాలొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటనలు తక్కువే. అత్యధిక మృతదేహాలకు పలు సేవా సంస్థల నిర్వాహకులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని బోడిగానితోట శ్మశానవాటికలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా కనిపిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 17కుపైగా కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరిగాయి. దహనక్రియలు కోసం మృతదేహాలను తెచ్చి తమ వంతు కోసం రోజంతా బంధువులు, సేవా సంస్థల ప్రతినిధులు ఎదురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలావుంటే, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా పరీక్షలు చేయకుండానే వీళ్లను చేర్చుకుంటున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, ఈనెల 22 నుంచి ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకూ మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు.15 రోజులు పాటు నగరంలో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కర్ఫ్యూ సమయంలో మెడికల్, అత్యవసర సర్వీసుల షాపులకు 24 గంటలు అనుమతి ఉంటుందన్నారు. నగరంలోని ప్రజలు ప్రతీ ఒక్కరూ సహకరించాలని.. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. బయటకు వచ్చిన సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు.