AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంపై అనుమానంతో ప్రసన్న అనే యువకుడిని హత్య చేసి, ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు నిందితులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు గల కారణాలను వివరించారు. ఈ దారుణ ఘటన గుంటూరులో చర్చనీయాంశంగా మారింది.

శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
Nallapadu Murder Solved
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 12:08 PM

Share

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ఏకో పార్క్ సమీపంలో ఒక యువకుడిని హత్య చేసి, ఆధారాలు లేకుండా చేశారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు సౌత్ డీఎస్పీ పూర్ణ చంద్రరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియకు వెల్లడించారు.

గుంటూరు సౌత్ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14వ తేదీన మృతుడు ప్రసన్న కనిపించడం లేదంటూ అతని తల్లి శాంతమ్మ నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏకో పార్క్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

మృతదేహంపై ఉన్న దుస్తులను పరిశీలించిన శాంతమ్మ.. అవి తన కుమారుడు ప్రసన్న ధరించినవేనని గుర్తించారు. దీంతో మృతుడు ప్రసన్నేనని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసును హత్య కోణంలో విచారణ చేపట్టారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు బుల్లయ్యకు తురకపాలెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే మహిళతో మృతుడు ప్రసన్నకు కూడా వివాహేతర సంబంధం ఉందని బుల్లయ్య అనుమానించినట్లు వెల్లడించారు. ఈ కారణంతో ప్రసన్నపై బుల్లయ్య కక్ష పెంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పథకం ప్రకారం ప్రసన్నను మద్యం సేవించేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన నిందితులు.. నల్లపాడు రోడ్డులోని జనచైతన్య ఫ్లాట్ల వద్ద ఏకో పార్క్ సమీపానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ రాయితో ప్రసన్న తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారని తెలిపారు. హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసేందుకు మృతదేహాన్ని కాల్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రసన్నను హత్య చేసినట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల పాత్ర, ఇతర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ పూర్ణ చంద్రరావు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us