AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయల్ వశిష్ట ఆపరేషన్.. ఈసారైనా సక్సస్ అవుతుందా..?

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా..? పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా..? కళ్లు కాయలు కాచేలా తమ వారికోసం ఎదురుచూస్తున్న బాధితులు ఆశలు నెరవేరేనా..? అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు ఒప్పుకున్న ధర్మాడి సత్యం టీం తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మరోసారి బోటును వెలికితీసేందుక సిద్ధమైంది. గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు కథ […]

రాయల్ వశిష్ట ఆపరేషన్.. ఈసారైనా సక్సస్ అవుతుందా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 15, 2019 | 5:02 PM

Share

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా..? పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా..? కళ్లు కాయలు కాచేలా తమ వారికోసం ఎదురుచూస్తున్న బాధితులు ఆశలు నెరవేరేనా..? అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు ఒప్పుకున్న ధర్మాడి సత్యం టీం తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మరోసారి బోటును వెలికితీసేందుక సిద్ధమైంది.

గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు కథ ముగిసింది. ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి బోటు వెలికితీత పనులు. దాదాపు నెల రోజులు పూర్తైనా.. బోటును వెలికితీయక పోవడంతో ఇక వశిష్ట ఆపరేషన్ కథ ముగిసిందని అంతా అనుకుంటున్నారు. అయితే తాము ఎలాగైనా బోటును వెలికితీస్తామని చెప్పిన ధర్మాడి సత్యం టీం నాలుగు రోజుల పాటు కష్టపడింది. చివరికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పనులను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ రెండో ప్రయత్నం కోసం సిద్దమైంది. ఘటనలో 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, గల్లంతైన వారు ఎంతమంది అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అధికారులు మాత్రం ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. ఇక ఇప్పటివరకూ 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దేవిపట్నం పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో బోటు యజమాని కోడిగుట్ల వెంకటరమణ, ఎల్లా ప్రభావతి, ఎర్రంశెట్టి అచ్చుతామణి, బోటు యూనియన్ లీడర్స్ మురళి, ప్రకాష్ రావు, గుమస్తా శ్రీనివాసరావు లపై కేసు నమోదు చేశారు. టికెట్ బుకింగ్ ఏజెంట్లైన మరో 7 గురి పై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 15వ తేదీన కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రస్తుతం 300 అడుగులకు పైగా లోతులో కూరుకుపోయింది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది. ఈ విధానంలో ముప్పైయేళ్ల అనుభవం నుంచి ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పటించారు. కాగా, కాంట్రాక్ట్ తీసుకున్న తరువాతి రోజు నుంచే.. బోటును వెలికితీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఆపరేషన్ వశిష్టకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమైంది. సత్యం బృందంతో పాటు 25 మంది మత్స్యకారులు, మరో 25 మంది ఎక్స్‌పర్ట్స్ సోమవారం సాయంత్రం కచ్చులూరు వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా ఓ భారీ ప్రొక్లెయినర్, పంటు, మర బోటును కచ్చులూరు వద్దకు చేర్చారు. అయితే రెండో సారి కూడా ఆపరేషన్‌ను మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది. ఇక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని.. కొద్ది గంటల సమయంలోనే బోటును వెలికితీస్తామంటున్నారు సత్యం బృందం. ఈ సారైనా ఆపరేషన్ వశిష్ట సక్సస్ అవుతుందా చూడాలి.