Andhra Pradesh: అలా చేయొద్దన్నందుకు హెడ్ మాస్టర్పై దాడి చేసిన విద్యార్థి.. ఇంటికెళ్లి ఏం చేశాడంటే..?
ప్రస్తుత కాలంలో చాలామంది క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే, పిల్లల ప్రవర్తన తీరు సరిగా లేకపోతే ఎలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియచెప్పే ఉదాహరణ ఇదీ.. ఏడాది క్రితం పదవతరగతి పూర్తిచేసిన బాలుడు.. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ పాఠశాల అమ్మాయిల ముందు ఫోజు కొట్టేందుకు వెళుతుండేవాడు.

ప్రస్తుత కాలంలో చాలామంది క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే, పిల్లల ప్రవర్తన తీరు సరిగా లేకపోతే ఎలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియచెప్పే ఉదాహరణ ఇదీ.. ఏడాది క్రితం పదవతరగతి పూర్తిచేసిన బాలుడు.. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ పాఠశాల అమ్మాయిల ముందు ఫోజు కొట్టేందుకు వెళుతుండేవాడు. అయితే, అదే పాఠశాలలో పాఠాలు చెబుతున్న హెడ్ మాస్టర్ ఆ బాలుడిని చూసి.. ఇలా చేయొద్దంటూ వారించే ప్రయత్నం చేశాడు. అమ్మాయిల ముందు హెడ్ మాస్టర్ తనను ఎగతాళి చేశాడని.. బాలుడు తాను తింటున్న ఐస్ క్రీంను హెడ్ మాస్టర్ పైకి విసిరేశాడు. ఇంతలో హెడ్ మాస్టర్ మీద పడిన ఐస్ క్రీంను తుడుచుకుంటుండగానే.. బాలుడు దాడి చేశాడు.. ఈ విషయం తెలుసుకున్న టీచర్లు పరుగున అక్కడికి చేరుకుని వారించారు. హెడ్ మాస్టర్ పరిస్థితి చూసి చలించిపోయారు. నిరంతరం ఇలానే జరుగుతుండటం, పూర్వ విద్యార్థి రోజూ బెదిరిస్తుండటంతో.. వారంతా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడిని మందలించి పంపించేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ పూర్వ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది.
పూడిమడక ఉన్నత పాఠశాలలో..
జిల్లాలోని అచ్చుతాపురం మండలం పూడిమడకలో చోటుచేసుకున్న ఈ ఘటన విషాదాంతంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడి మడక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదవ తరగతి పూర్తి చేసిన మేరుగు ధనరాజు (16) అనే పూర్వ విద్యార్థి ఈ నెల 22 న పాఠశాల వద్దకు వచ్చాడు. క్లాస్ రూంలో పాఠం చెబుతున్న హెడ్ మాస్టర్ రామ శేషు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రశ్నించినందుకు తాను తింటున్న ఐస్ క్రీంను హెడ్ మాస్టర్ ముఖం పై విసిరాడు. అంతటితో ఆగక దాడి చేసినట్లు హెడ్ మాస్టర్తో పాటు టీచర్లు ధనరాజుపై అచ్చుతాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. మైనర్ అయిన ధనరాజు పై కేసు నమోదు నమోదు చేసి 41 A నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఇంటికి వెళ్లిన ధనరాజు నిన్న రాత్రి ఇంట్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హెడ్ మాస్టర్, పోలీసుల వేధింపులతోనే..
ధన రాజు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.. హెడ్ మాస్టర్, పోలీసుల వేధింపుల వల్లే ధనరాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పదవతరగతి మార్క్స్ మెమో కోసం వెళ్తే హెడ్ మాస్టర్ కొట్టాడని, ఆవేశంలో ధన రాజు హెడ్ మాస్టర్ను నెట్టాడని.. అంత మాత్రానా కేసు పెడతారా అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ధన రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..