Elephants Destroy Crops: బెంబేలెత్తిస్తున్న గజరాజులు.. చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో నానా హంగామా
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగుల గుంపు బెంబేలెత్తిస్తోంది. పంట పొలాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మామిడి, టమోట, అరటి, చామంతి పూల..
Elephants destroy crops: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగుల గుంపు బెంబేలెత్తిస్తోంది. పంట పొలాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మామిడి, టమోట, అరటి, చామంతి పూల తోటల్ని దారుణంగా ధ్వంసం చేస్తున్నాయి. పొలాల్లోని డ్రిప్పు పరికరాలను కూడా వదలడం లేదు.
మోట్లచేను, పైపాల్యం, వెండిగాంపల్లి, పల్లార్ల పల్లి, గంగాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆరు ఏనుగులు తిష్ట వేశాయి. ఎప్పుడు పడితే అప్పుడు గ్రామ పరిసరాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తున్నాయి. ఇక అవి పోట్లాడుకోవడం చూసి జనమంతా హడలిపోతున్నారు. భీకరంగా ఘీంకరిస్తూ పరుగు తీస్తున్నాయి.
కలియబడుతూ ఎక్కడ ఊళ్లోకి వచ్చి ఇళ్లను ధ్వంసం చేస్తాయోనని భయంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. గజరాజలు సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. ఏనుగుల భయంతో చాలాసార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గజరాజుల సమూహంపై దృష్టి సారించిన అధికారులు.. వాటి అడుగుల ఆధారంగా అవి ఎక్కడినుంచి వస్తున్నాయో గుర్తించారు.
ఏనుగుల గుంపు తమిళనాడు నుంచి వస్తున్నట్టు చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు. కుప్పంలో ప్రత్యక్షమవుతున్న ఏనుగులు ఒక్కోసారి నగరి వైపు వెళ్తున్నాయి. దారి తప్పిన ఏనుగులు ఏటువైపు వెళ్తాయోనన్న ఆందోళన స్థానికుల్ని కంగారెత్తిస్తుంది.
అధికారులు మాత్రం వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. బుల్లెట్ల చప్పుడు చేస్తూ వచ్చిన దారిలోనే అవి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏనుగుల గుంపు ఎక్కడ కనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పరిసర ప్రాంతాల ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..