AP News: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు.. ఈసీ కీలక ఆదేశాలు..

| Edited By: Srikar T

May 23, 2024 | 7:54 PM

జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.

AP News: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు.. ఈసీ కీలక ఆదేశాలు..
Cec Mukesh Kumar Meena
Follow us on

జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమీష్టి కృషితో మే 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటు వంటి వివాదాలకు తావులేకుండా సంబంధిత వివరాలను అందించాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలను వేరుగా.. అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్‎లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‎ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలని తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టాలని, ఆ తరువాత ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు.

ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు. అదే విధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్‎ను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‎లో ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్‎కు ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..