AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Effect: మూగ జీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్‌ భూతం.. ఆవుల కడుపుల్లోంచి భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు

Plastic Effect ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్పల..

Plastic Effect: మూగ జీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్‌ భూతం.. ఆవుల కడుపుల్లోంచి భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 14, 2021 | 7:04 PM

Share

Plastic Effect: మన దేశంలో సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తాం. హిందూ ధర్మం ప్రకారం ఆవును దేవతగా పూజిస్తాం. అయితే ప్రస్తుతం ఆవులు ఎంతో దయనీయమైన స్థితిలో బతుకుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో చాలా ఆవులు తిండి లేక వ్యర్థాలను, చెత్తచెదారాన్ని తింటున్నాయి. రోడ్డుపై దొరికిన దాన్నే ఆహారంగా తీసుకుంటున్నాయి. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటోంది. తాజాగా విజయవాడలో ఆవు కడుపులో నుంచి భారీ ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు పశువైద్యులు. ఇలా మూగజీవాలైన ఆవులు, మేకల కడుపుల్లోంచి ప్లాస్టిక్‌ వ్యవర్థాలు బయటకు రావడం వైద్యులే ఆశ్యర్యపోతున్నారు. ఈ ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్పల మధ్య ప్లాస్టిక్ సంచులు తింటున్నాయి. నగరప్రజలు బాధ్యతారహితంగా రోడ్లపై ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇష్టారాజ్యంగా పడేయడంతో వాటిని తిని గోమాతలు తనువు చాలిస్తున్నాయి. అయితే ఏపీలో ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య వెంటాడుతోంది. వీటితో మనుషులతో పాటు పశుపక్షాదులకు కూడా ప్రమాదం ఏర్పడుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోడ్లపై తిరిగే ఆవులు, మేకలపై ఈ ప్లాస్టిక్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. రోడ్లపై తినే ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లు ఇతరత్రా ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా కడుపులోకి పోవడంతో అవి పెద్ద మొత్తంలో పేరుకొని రక రకాల వ్యాధులతో బారిన పడి మృత్యువాత పడుతున్నాయి.

అయితే నగర పాలక సంస్థలు ఈ ప్లాస్టిక్‌ వ్వర్థలపై చర్యలు తీసుకోకపోవడంతోనే మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇంటింటికి చెత్త సేకరణ మంచి ఫలితాన్ని ఇచ్చినా రోడ్లపై పరిస్థితి మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ముందు ముందు ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలను హరిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూగజీవాల ప్రాణాలు కాపాడుతున్న స్వచ్ఛంద సంస్థలు

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని రకరకాల వ్యాధులు సోకి వందలాది ఆవులు చనిపోతుండటంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుగానే ఇలాంటి వాటిని గుర్తించి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడుకున్నాయి. వైద్యం చేసే డాక్టర్లు సైతం ఆవుల కడుపులో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత మొత్తంలో ఆవు కడుపులో ఉన్న ప్లాస్టిక్ ద్వారా ఆవులకే కాకుండా ఆవు పాల ద్వారా వచ్చే మనుషులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం వైద్యులు అంటున్నారు.

అయితే ప్లాస్టిక్ తినడం వల్ల దేశవ్యాప్తంగా ఎన్ని ఆవులు చనిపోతున్నాయనే అంశంపై అధికారిక సమాచారం లేదు. 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పశువైద్య అధికారులు, జంతు సంక్షేమ సంఘాలను ఉటంకిస్తూ ఒక్క లక్నోలోనే ఏటా 1000 ఆవులు ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోతున్నాయని అంచనా వేసింది. ఇక ఇతర ప్రాంతాల్లో లెక్కపెట్టినట్లయితే ప్లాస్టిక్‌ కారణంగా మరణించే మూగజీవాల సంఖ్య భారీగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎదురవుతున్న ఉపద్రవాలు ఇన్నీ అన్నీ కావు. అవి వెదజల్లే కలుషిత వాయువులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భూగర్భ జలాలు విష కలుషితమవుతున్నాయి. వ్యర్థాలు కలిసిన గడ్డిని మేసి పశువులు మృత్యువాత పడుతున్నాయి.