Andhra Pradesh: టికెట్ తీసుకుని బస్సు దిగిపోయిన ప్రయాణికుడు.. చివరకు ఆర్టీసీకి బిగ్ షాక్!
కాకినాడ జిల్లాలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి సంబంధించిన ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై కాకినాడ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆర్టీసీకి రూ.15 వేల జరిమానా విధించింది.

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి సంబంధించిన ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై కాకినాడ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆర్టీసీకి రూ.15 వేల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ 29న కాకినాడకు చెందిన అఖిల్ అనే వ్యక్తి కాకినాడ నుంచి వాడపల్లి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో రూ.85 చెల్లించి టికెట్ తీసుకున్నాడు. అయితే 41 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న బస్సులో ఏకంగా 96 మందిని ఎక్కించడంతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రయాణం సురక్షితం కాదని భావించిన అఖిల్ బస్సు దిగిపోయి ఆటోలో తిరిగి కాకినాడకు చేరుకున్నాడు.
ఈ ఘటనపై ఆర్టీసీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందంటూ అఖిల్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్, ప్రయాణికుల భద్రత విషయంలో ఆర్టీసీ నిర్లక్ష్యం ప్రదర్శించిందని నిర్ధారించింది. దీంతో మానసిక ఇబ్బందులు, సేవల్లో లోపానికి పరిహారంగా రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలుతో పాటు టికెట్ మొత్తమైన రూ.85ను కూడా అఖిల్కు తిరిగి చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఈ తీర్పు ప్రజా రవాణా సంస్థలు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
