Andhrapradesh: చెన్నై అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి.. తిరుపతిలో పరిచయం.. సినీ ఫక్కీలో ప్రేమ పెళ్లి.. హైవేపై హైడ్రామా

గతనెల 7న తిరుపతి వెళ్లాడు. అక్కడ క్యూ కాంప్లెక్స్‌లో జీవితతో పరిచయం ఏర్పడింది. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. అక్కడ ఫోన్‌ నంబర్లు తీసుకున్న రాజేష్‌, జీవితలు అప్పటి నుంచి నిత్యం మాట్లాడుకోవడం ప్రారంభించారు.

Andhrapradesh: చెన్నై అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి.. తిరుపతిలో పరిచయం.. సినీ ఫక్కీలో ప్రేమ పెళ్లి.. హైవేపై హైడ్రామా
Love Maariage In Andhra Pradesh
Follow us

|

Updated on: Nov 06, 2022 | 2:53 PM

చెన్నైకు చెందిన అమ్మాయి… ఆంధ్రాకు చెందిన అబ్బాయి..ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు ఇష్టంలేకపోయినా వాళ్ళకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు వీరి ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో వివాదం మొదలైంది. దీంతో వారిని వేరు చేసేందుకు విఫలయత్నం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు.. పోలీసుల దగ్గర పంచాయతీ పెట్టారు… అమ్మాయి తాను మేజర్‌నని అబ్బాయితోనే ఉంటానని తేల్చిచెప్పేసింది… దీంతో చేసేంది లేక అమ్మాయి బంధువులు హిజ్రాలను రంగంలోకి దించారు. అబ్బాయి ఇంటికి వెళ్ళి తలుపులు పగులగొట్టి మరీ అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారు… విషయం పోలీసులకు చేరింది… దీంతో ఛేజింగ్‌ జరిగింది… ఒంగోలు – టంగుటూరు హైవేపై అరగంటపాటు హైడ్రామా నడిచింది. హిజ్రాలు పోలీసులను అడ్డుకుని అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అమ్మాయిని వారి బారి నుంచి అదుపులోకి తీసుకుని ప్రేమజంటను తిరిగి ఒక్కటి చేశారు.. సినీ ఫక్కీలో జరిగిన ఈ వ్యవహారం ప్రకాశంజిల్లా గుండమాల గ్రామంలో జరిగింది.

చెన్నైలో స్థిరపడిన తెలుగమ్మాయి జీవిత తిరుపతి జిల్లా గూడూరులో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రకాశంజిల్లా కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన రాజేష్‌ ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. గతనెల 7న తిరుపతి వెళ్లాడు. అక్కడ క్యూ కాంప్లెక్స్‌లో జీవితతో పరిచయం ఏర్పడింది. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. అక్కడ ఫోన్‌ నంబర్లు తీసుకున్న రాజేష్‌, జీవితలు అప్పటి నుంచి నిత్యం మాట్లాడుకోవడం ప్రారంభించారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 20న సింగరాయకొండలోని పోలేరమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడం, అమ్మాయి ఇల్లు వదిలి రావడంతో జీవిత తల్లిదండ్రులు గూడూరు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఇరువురు మేజర్లు కావడంతో వారు రక్షణ కావాలని కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించారు. జీవిత తల్లిదండ్రులు గత నెల 23న కొత్తపట్నం స్టేషన్‌కు వచ్చి వారి వివాహం జరిగిన విషయం తెలుసుకున్నారు. అనంతరం జీవితను వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె తల్లిదండ్రుల వెంట వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో వారు చేసేదిలేక వెళ్లిపోయారు.

జీవిత తమకు ఇష్టంలేకుండా కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు నిన్న సాయంత్రం రెండు వాహనాల్లో గూడూరు నుంచి హిజ్రాలతో కలిసి ప్రకాశంజిల్లా కొత్తపట్నం మండలం గుండమాలకు వచ్చారు. గుండమాల గ్రామంలోని రాజేష్‌ ఇంటికి వెళ్లి అతనిపై దాడిచేశారు. బలవంతంగా జీవితను వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు. దీంతో యువతిని కిడ్నాప్‌ చేసి తీసుకెళుతున్నట్లు పోలీసులకు రాజేష్‌ బంధువులు సమాచారం ఇచ్చారు. రెండు వాహనాలను అడ్డుకునేందుకు ఒంగోలు నుంచి టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవరావు ఆధ్వర్యంలో పోలీసులు జాతీయ రహదారిపై కాపుకాశారు. సూరారెడ్డిపాలెం సమీపంలో రెండు వాహనాలను పోలీసులు నిలిపివేశారు. వారిని హిజ్రాలు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో హైవేపై కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే అటు నుంచి టంగుటూరు పోలీసులు కూడా రావడంతో సీఐ రాఘవరావు అందరినీ అదుపులోకి తీసుకొని ఒంగోలు టూటౌన్‌కు తరలించి విచారించారు. జీవిత పెదనాన్నతోపాటు హిజ్రాలు మొత్తం 19 మందిపై కొత్తపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే రెండు వాహనాలను సీజ్‌ చేశారు… తాము ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని, అయితే తమది కులాంతర వివాహం కావడంతో జీవిత తల్లిదండ్రులు తమను విడదీయడానికి చూస్తున్నారని, ఆ క్రమంలో తన ఇంటిపై దాడి చేసి జీవితను కిడ్నాప్‌ చేస్తే పోలీసులు రక్షించి తీసుకోచ్చారని జీవిత, రాజేష్‌లు చెబుతున్నారు… తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

గుండమాల గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేష్‌, జీవితలను విడదీసేందుకు జీవిత తల్లిదండ్రులు భీభత్సం సృష్టించారని రాజేష్‌, బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు… ఇలాంటి దృశ్యాలు సినిమాల్లోనే చూస్తామని, అయితే గుండమాల గ్రామంలో ఇలాంటి సీన్ చూసి బిత్తరపోయామంటున్నారు… జీవిత, రాజేష్‌లకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Reporter: Fairoz , TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..