పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!
కుటుంబ పెద్ద మృతి అనంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విద్య అభ్యాసం కోసం రంగరాయ మెడికల్ కాలేజీకి ఓ కుటుంబం దానం చేసింది. సాంప్రదాయలు దాటి మృతదేహాన్ని వైద్య విద్య కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించిన వందలమంది జనాలు. మరణ అనంతరం తమ దేహాన్ని ఉపయోగించుకోమని దేహదానం చేసే ఆదర్శవాదులకు పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం..

కాకినాడ, మే 13: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఒక మహోన్నత సేవగాథ అందరి హృదయాలను కదిలిస్తోంది. మండపేటకు చెందిన దేహదాత, ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీర్రాజు జీవితం చివరి దశలో కూడా సమాజానికి ఉపయోగపడే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన దేహాన్ని వైద్య విద్యార్థుల అభ్యాసం కోసం దానం చేయాలని ముందుగానే ఒప్పంద పత్రాలపై సంతకం చేసి తన మహోన్నత మనసును చాటుకున్నారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహకారం అందించి, రంగరాయ మెడికల్ కళాశాలకు ఆయన పార్థివ దేహాన్ని నిబంధనల ప్రకారం అందజేస్తున్నారు.
బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వందలాది మంది తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. సంప్రదాయాలకు అతీతంగా సమాజ ప్రయోజనం కోసం తన దేహాన్ని అంకితం చేసిన ఆయన నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వైద్య విద్యలో మానవ శరీర నిర్మాణంపై అవగాహన కోసం దేహదానం ఎంతో కీలకం. ఇటువంటి దాతల దేహాలను “సైలెంట్ టీచర్స్”గా వైద్య కళాశాలలు గౌరవిస్తాయి. ప్రతి అవయవం, ప్రతి భాగం వైద్య విద్యార్థులకు అధ్యయనానికి ఉపయోగపడుతుంది. అందుకే దేహదానం అత్యున్నత మానవతా సేవగా భావించబడుతోంది. హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా దేహదానంపై ఎటువంటి నిషేధం లేదని పండితులు చెబుతున్నారు. దధీచి మహర్షి తన దేహాన్ని లోకకళ్యాణం కోసం అర్పించినట్లే, ఆధునిక కాలంలో దేహదానం కూడా మహాదానంగా పరిగణించబడుతోంది. మరణం అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదని గరుడ పురాణం వివరిస్తుంది. ఆత్మ శాశ్వతమైందని, మానవ సేవ కోసం చేసిన త్యాగం మహా పుణ్యఫలాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
తండ్రి చివరి కోరికను గౌరవిస్తూ, లాభాపేక్ష లేకుండా దేహాన్ని వైద్య విద్య కోసం దానం చేసిన బిక్కిన కుటుంబ సభ్యుల సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. నేత్రదానం, అవయవదానం, దేహదానాలు పవిత్రమైనవి. ఇవి సమాజానికి వెలుగునిచ్చే మహోన్నత సేవలు. ఆదర్శ దేహదాత బిక్కిన వీర్రాజు పునర్జన్మ రాహిత్య శాశ్వత కైవల్య ప్రాప్తి కలగాలని పరమేశ్వరుణ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేద్దాం!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




