Watch: ఇదేదో సినిమా షూట్ అనుకునెరు.. అసలు మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్రశాంతమైన పశ్చిమ గోదావరిజిల్లా భీమవరంలో సినిమా తరహాలో హత్యాయత్నం జరిగింది. ఒక వ్యక్తిని చంపేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కారుతో ఢీ కొట్టి, కత్తులతో వెంబడించారు. రోడ్ పై వెళుతున్న వాహనదారులు నిశ్చేష్టులై చూస్తుండగానే సీన్ మొత్తం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సినిమా తరహాలో ఓ వ్యక్తిని వెంటాడి కత్తులతో హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ కేసులో భీమవరం డిఎన్ఆర్ కాలేజీ రోడ్డులో ఉన్న కోర్టులో ఓ రౌడీ షీటర్ విచారణ కోసం వచ్చిన సందర్భంగా ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రఘు అనే రౌడీ షీటర్ ఓ కేసు విచారణ సందర్భంగా ఇటీవల భీమవరంలోని కోర్టుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మరో రౌడీ షీటర్ గోవింద్ అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.
రఘు కోర్టు నుంచి బయటకొచ్చి కారులో వెళ్తున్న సమయంలో మరో కారులో వచ్చిన రౌడీ షీటర్ గోవింద్ తన కారుతో రఘు కారును ఢీ కొట్టించాడు. కారు ఆగిన వెంటనే గోవింద అనుచరులు కత్తులతో రఘుపై దాడి చేయడానికి యత్నించడంతో అప్పటికే అప్రమతమైన రఘు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగు తీశాడు. కోర్టు వద్ద ఉన్న పోలీసులు సైతం అప్రమత్తం కావడంతో గోవింద్ కూడా పరారయ్యాడు.
ఇక ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న రఘు పోలీసులను ఆశ్రయించాడు. గోవింద్తో పాటు మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేసినట్లు పొలిసులకు తెలిపాడు. కాగా ఇప్పటికే రఘు మీద 11 కేసులు, గోవింద్ పై 10 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాత కక్షలు నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్న పోలీసులు గోవింద్ అతని అనుచరులకోసం గాలిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
