AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MANSAS trust ఛైర్మన్‌ సంచయిత నియామక జీవో రద్దు.. అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను హైకోర్టు కొట్టేసింది. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను....

MANSAS trust ఛైర్మన్‌ సంచయిత నియామక జీవో రద్దు.. అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం
Mansas Trust
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2021 | 4:26 PM

Share

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను హైకోర్టు కొట్టేసింది. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాన్సాస్‌, సింహాచ‌లం ట్రస్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత త‌న నిర్ణయాన్ని వెల్లడించింది. తిరిగి అశోక్ గజపతిరాజును ఈ రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది. గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మర్నాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్రస్టు కావడంతో వ‌య‌సులో పెద్దవారు ట్రస్టీగా ఉండాల‌ని.. ప్రభుత్వం నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా ఈ ట్రస్టుల ఛైర్మన్‌ను నియ‌మించింద‌ని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్రకార‌మే నియామ‌కం చేశామ‌ని ప్రభుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తిరిగి నియ‌మించాల‌ని తాజాగా ఆదేశించింది.

అసలు వివాదం ఏంటి?  

1958లో పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు.. మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టును స్థాపించారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తరువాత మాన్సాస్ ఛైర్మన్ పదవిని పీవీజీ రాజు రెండో కుమారుడు.. అశోక్ గజపతి రాజు చేపట్టారు. 2020 మార్చిలో జీవో 72 ద్వారా ప్రభుత్వం..అశోక్ గజపతిరాజును తొలగించి.. ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్ర‌బాబు స్పంద‌న

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని తెలిపారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని పేర్కొన్నారు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Also Read: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకునే విధానం ఇది