AP PRC: క్లైమాక్స్కి చేరిన ఏపీ పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం జగన్ సంక్రాతి కానుక.. ఫిట్మెంట్ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల PRCపై పీటముడి వీడనుంది.. గురువారం ఉద్యోగ సంఘాలనేతల భేటీలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
AP Government PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల PRCపై పీటముడి వీడనుంది.. గురువారం ఉద్యోగ సంఘాలనేతల భేటీలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ముఖ్యమంత్రి సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఉద్యోగులకు ఎంతశాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నారు..?
ఏపీ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న PRC క్లైమాక్స్కి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమవుతున్నారు. ఇంకా PRC వ్యవహారంపై నాన్చటం సరికాదని.. తేల్చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డితో భేటీ అయ్యారు. PRC, ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు. ఉద్యోగులకు ఎంతశాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపినట్లు సమచారం.
PRCపై ఉద్యోగ సంఘాలతో గురువారం సీఎం జగన్ సమావేశమవుతారని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. రేపే ఫైనల్ డిసిషన్ ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగులను సంతృప్తి పరిచే విధంగా ఫిట్మెంట్ ఉండబోతున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
మరోవైపు, ఉద్యోగ సంఘాల నేతలు ఎంతశాతం మేర ఫిట్మెంట్ ప్రతిపాదించే అవకాశం ఉందనే దానిపై అధికారులు సీఎం జగన్కు సమావేశంలో వివరించారు. ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో 40శాతానికి పైగా డిమాండ్ చేస్తున్నా…30 శాతానికి అటు ఇటుగా ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే DAల బకాయిలు సైతం ఉండటంతో ..వీటిని సైతం పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ వద్ద ఫిట్మెంట్పైన ఉద్యోగ సంఘాలు ప్రతిపాదన చేసే అవకాశం ఉంది.
దాంతోపాటు వివిధ బిల్లులు చెల్లించాల్సిన మొత్తం 16 వందల కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఈ అంశంపైనా ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో సహా ఆర్థిక పరమైన అంశాలకు సీఎం జగన్ గురువారం ముగింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా PRC ప్రకటించే అవకాశం ఉంది. అయితే PRC ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది మాత్రం సీఎం జగన్ సమావేశంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.