AP News: ‘ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం’.. అదే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న కాంగ్రెస్..
ఏపీ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా నినాదంతో పాటు జనాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడైంది.

ఏపీ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా నినాదంతో పాటు జనాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడైంది.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఇతర ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏపీలో పొత్తుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు నేతలు. ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. పొత్తులు ఏ విధంగా ఉండాలి.. పొత్తుల్లో భాగంగా ఏయే స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.
ఏయే అంశాలతో ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ఆ పార్టీ పదే పదే చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇస్తామనే హామీని కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ కీలక భేటీకి కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పల్లంరాజు, జేడి శీలం, తులసి రెడ్డి, రుద్రరాజు సహా ఇతర నేతలు హాజరయ్యారు.




