పెద్దనోట్లే అవినీతి మూలం.. రూ. 500 నోట్లపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ పనైపోయిందన్న వాళ్ల అడ్రస్ లేకుండా పోయిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని మహానాడు వేదికగా మరోసారి స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన సభా వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ పనైపోయిందన్న వాళ్ల అడ్రస్ లేకుండా పోయిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని మహానాడు వేదికగా మరోసారి స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన సభా వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పెద్ద నోట్లన్నింటిని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని.. వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలోనే డిజిటల్ కరెన్సీకి మద్దతుగా ప్రధానికి విజ్ఞప్తి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. రూ. 1000, రూ.500 నోట్లు రద్దు చేసి కొత్తగా రెండు వేల నోటు తెచ్చారని.. ఇప్పుడు పరిస్థితుల్లో అవసరమైతే రూ. 500 సహా అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలని ఏపీ సీఎం కేంద్రానికి సూచించారు. పెద్దనోట్లే అవినీతి మూలమని.. నోట్ల రద్దు ద్వారానే నిజమైన పారదర్శకత సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు..
కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని.. అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. పాలన అంటే వేధింపులే అన్నట్లుగా గతంలోని పాలకులు వ్యవహరించారన్నారు. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ఆశలు చిగురించాయని చెప్పారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని మరోసారి స్పష్టం చేశారు. పరిపాలనలో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తామని.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలోని అన్ని పార్టీలు కలిసి నడవాలని చంద్రబాబు అన్నారు.
భావితరాల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాల రూపకల్పన చేసిందన్నారు. రాష్ట్రం ఫస్ట్ అనేదే టీడీపీ నినాదమమన్నారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని.. 2047 నాటికి జీరో పావర్టీ సాధిస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ ఛేంజర్ అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి చూపిస్తామన్నారు. సంపద సృష్టించి.. దాన్ని ప్రజలకు పంచుతామని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




