తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏయే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో, ఉత్తర కోస్తాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల వాతావరణ సూచన
ఉత్తర కోస్తాంధ్ర – యానాం: రాగల మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర: ఈరోజు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే వీలుంది. తీరం వెంబడి గంటకు 40 – 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
రాయలసీమ: రాగల మూడు రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశముంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయి.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి – హెచ్చరికలు
ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఉత్తరప్రదేశ్ మీదుగా కదులుతూ తెలంగాణకు దూరంగా వెళ్లింది. దీంతో ఆ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తగ్గింది. అయితే బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, ప్రజలు, తీరప్రాంత ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
