Andhra Pradesh: కారవాన్లో బోర్డు మీటింగ్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన..
ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కారవాన్లోనే బోర్డు మీటింగ్ పెట్టుకునేలా సరికొత్త ఆలోచన అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఏపీ టూరిజం అభివృద్ది సంస్థ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ సేవలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్నారు. ఇక్కడ వంద కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కారవాన్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వైజాగ్ తో పాటు సూర్యలంక వద్ద కూడా కారవాన్ లను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే ఏపి టూరిజం అభివృద్ది సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజి సరికొత్త ఆలోచన చేశారు.
విజయవాడ నుండి సూర్యలంక కారవాన్ లో ప్రయాణిస్తూ బోర్డు మీటింగ్ నిర్వహించారు. సాధారణంగా పెద్ద పెద్ద హోటల్స్ లేదా కార్పోరేట్ కార్యాలయాల్లో మాత్రమే బోర్డు మీటింగ్స్ జరుగుతుంటాయి. అయితే కారవాన్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని ఛైర్మన్ బాలాజీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏపిటిడిసి ఛైర్మన్ బాలాజీతో పాటు డైరెక్టర్లు, సిఎస్ అజయ్ జైన్, ఏపి టూరిజం అథారటీ సీఈవో పద్మావతి కారవాన్ లో ప్రయాణిస్తూ టూరిజం అభివృద్దికి ఏయే చర్యలు తీసుకోవాలో చర్చించారు. ప్రత్యేకంగా అలకరించిన కారవాన్ లో కావడంతో స్థానికులు కూడా ఆసక్తిగా తిలకించారు. ఏపిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే బోర్డు మీటింగ్ వినూత్నంగా ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ బాలాజీ చెప్పారు. విజయవాడ పున్నమి రిసార్ట్స్ నుండి బయలు దేరిన కారవాన్ రెండున్నర గంటల తర్వాత సూర్యలంక బీచ్ కు చేరుకుంది. అక్కడ ఏపిటిడిసి సిబ్బంది బోర్డు సభ్యులకు ఘన స్వాగతం పలికారు.
కార్పోరేట్ సంస్థలకు కారవాన్ లను ఇచ్చేందుకు ఏపిటిడిసి సిద్దం చేసింది. కారవాన్ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ ప్రముఖ పర్యాటక స్థలాలకు కారవాన్ లో వెళ్లేలాగా ప్రణాళికలు రూపొందించారు. సూర్యలంక బీచ్ వద్ద బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బాలాజీ, సిఎస్ అజయ్ జైన్ మీడియాకు వెల్లడించారు. సోలార్ బోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త హోటల్స్ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
