Andhra Pradesh: వామ్మో..వీళ్లు మామూలు దొంగలు కాదు! కొద్దిపాటి డబ్బుకోసం ప్రమాదకర చోరీలు..
ఈ ఏడాది రైతులు సాగు నీరు లభ్యం కాక ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఒక వైపు, ప్రాజెక్టుల్లో నీరు లేక మరొకవైపు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు బోర్లపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం విద్యుత్ ఇస్తున్న సమయంలోనే మోటార్లు ఆన్ చేసుకొని సాగు నీరు పెట్టుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది చోరులు చేస్తున్న పనులు రైతులపై మూలిగే..

పల్నాడు, నవంబర్ 8: ఈ ఏడాది రైతులు సాగు నీరు లభ్యం కాక ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఒక వైపు, ప్రాజెక్టుల్లో నీరు లేక మరొకవైపు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు బోర్లపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం విద్యుత్ ఇస్తున్న సమయంలోనే మోటార్లు ఆన్ చేసుకొని సాగు నీరు పెట్టుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది చోరులు చేస్తున్న పనులు రైతులపై మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా ఉంది.
ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దొంగలు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లపై పడింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లలో ఉండే కాపర్, అల్యూమినియం వైర్ కోసం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను చోరి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ చోరీల సంఖ్య ఎక్కువుగా ఉండటంతో రైతుల ఆందోళన మరింత ఎక్కువైంది. గురజాల మండలం పులిపాడులో వెంపటి గురవయ్యకు చెందిన 16 కేవి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగలించి అందులోని కాపర్ వైర్ను తీసుకెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన కొండ్రు రామారావు ట్రాన్స్ ఫార్మర్ను కూడా నెల రోజుల క్రితం అపహరించుకుపోయారు.
దీని వల్ల తమకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పైనే నష్టం వాటిల్లిందని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం పంటలకు నీరు పెట్టుకునే అవసరం ఎక్కువుగా ఉందని ఇటువంటి సమయంలో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం వలన పంటలు నష్టపోతున్నామంటున్నారు అన్నదాతలు. రామారావు పన్నెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అయితే ఒక్కో ట్రాన్స్ పార్మర్లో పది కేజీల వరకూ కాపర్ వైర్ ఉంటుంది. దీన్ని మార్కెట్లో విక్రయిస్తే ఇరవై వేల రూపాయల వరకూ ధర పలుకుతుంది. ఈ మధ్య కాలంలో ట్రాన్స్ ఫార్మర్లలో కూడా అల్యూమినియం వైర్నే ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం వైర్ దొంగిలించడం కోసం ఈ రకపు చోరీలకు పాల్పడుతున్నారు.
ఇంత చిన్న చిన్న మొత్తాల కోసం దొంగలు అత్యంత ప్రమాదకర స్థాయిలో దొంగతనాలు చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు ఉన్న విద్యుత్ వైర్లు తొలగించడం అన్నది చాలా రిస్క్తో కూడుకున్న పని. అయితే కొంతమంది మాత్రం విద్యుత్ లేని సమయంలో దొంగతనం చేస్తుంటే.. మరికొంత మాత్రం వైర్లకు వైర్లు తగిలేలా చేసి ట్రిప్ చేస్తున్నారని, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్ను కూడా దొంగలిస్తున్నారని తెలిపారు. ఈ తరహా దొంగతనాలు చాలా ప్రమాదరకరమైనవంటున్నారు. మరొక వైపు ట్రాన్స్ ఫార్మర్లు కొరత ఉండటంతో రైతులు సకాలంలో కొత్తవి కొనుగోలు చేయలేకపోతున్నారు. దీంతో కళ్ల ముందే పంటలు ఎండి పోతున్నాయి. దొంగలు పట్టుకొని తమ పొలాలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడులోనే ఇటువంటి దొంగతనాలు ఎక్కువగా ఉండటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




