AP MPTC ZPTC Results: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం.. జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. ఎంపీటీసీల్లోనూ అదే జోరు..

ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం.. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 13 జిల్లాలో ఫ్యాన్‌ స్పీడ్‌కు ఎదురే లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే అత్యధిక ZPTC స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి.

AP MPTC ZPTC Results: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం..  జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. ఎంపీటీసీల్లోనూ అదే జోరు..
Ap Mptc Zptc
Follow us

|

Updated on: Sep 20, 2021 | 12:24 PM

AP MPTC ZPTC Elections Result Updates: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం.. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 13 జిల్లాలో ఫ్యాన్‌ స్పీడ్‌కు ఎదురే లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే అత్యధిక ZPTC స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి.. ఓవరాల్‌గా ప్రాదేశిక ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆ పార్టీకి 98 శాతం ఫలితాలు వచ్చాయి. ఫ్యాన్‌ గాలికి చంద్రబాబు అడ్డాలో సైతం టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగింది. 13 జిల్లా పరిషత్తులను వైఎస్సార్‌సీపీనే అలవోకగా చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ సైతం ఆ పార్టీ రికార్డు స్థాయిలో గెలుపొందింది. మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలకు గానూ 641 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. వివిధ కారణాల దృష్ట్యా 19 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగలేదు. కాగా, ఆదివారం వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ 616 స్థానాల్ని కైవసం చేసుకుని తిరుగులేని అధిక్యత సంపాదించుకుంది. మొత్తం 10,047 ఎంపీటీసీలకు గానూ 9,590 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్‌సీపీ 8,200 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలను బహిష్కరించడం, గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థులు లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం నల్లేరుపై నడకలా సాగింది. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఏడు జడ్పీటీసీ స్థానాల్లోనూ 923 ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించారు. రెండు, మూడు మండలాల్లో వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీ ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్ని చేజిక్కించుకుంది. 179 ఎంపీటీసీ స్థానాలు గెలిచి జనసేన మూడో స్థానంలో నిలిచింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు రావడం మొదలైంది. రాత్రి 10 గంటల సమయానికి మెజార్టీ ఫలితాలు వెలువడ్డాయి.

జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైఎస్సార్‌సీపీకు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 11 చోట్ల, ఇతర కారణాలతో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 641 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

వైఎస్సార్‌సీపీ – 616 టీడీపీ           – 07 జనసేన       – 02 సీపీఎం       –  01 ఇతరులు   – 01

రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల, ఇతర కారణాల వల్ల 376 చోట్ల ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంతో కలుపుకుని 9,590 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో దాదాపు అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీకు కాస్తంత ఆశావహ ఫలితాలు వచ్చాయి. జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లో మెరుగైన ఫలితాలు దక్కాయి. ఆ పార్టీ గెలిచిన 179 ఎంపీటీసీ స్థానాల్లో 140 ఆ రెండు జిల్లాల్లోనే గెలవడం విశేషం.

వైఎస్సార్‌సీపీ – 8,200 టీడీపీ              – 923 జనసేన          – 179 బీజేపీ            – 28 సీపీఎం         – 13 సీపీఐ            – 08 కాంగ్రెస్        – 03 ఇతరులు      – 207

ఇదిలావుంటే, ఏప్రిల్‌ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పరిషత్‌ ఎన్నికలకు రెండోసారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలకు నిరసనగా పరిషత్‌ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలు, ప్రస్తుత ఎస్‌ఈసీ వ్యవహరించిన తీరు చూశాక… పరిషత్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని, టీడీపీ అభ్యర్థులు మెజార్టీ ఓట్లు సాధించినా గెలిచినట్టు ప్రకటిస్తారని, అక్రమ కేసులతో వేధించరనే నమ్మకం తమకు లేదని.. అందుకే ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్ని టీడీపీ బహిష్కరించినప్పటికీ.. నామినేషన్ల ప్రక్రియ గత ఏడాది మార్చిలోనే పూర్తవడం, అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే మళ్లీ కొనసాగించడంతో టీడీపీ అభ్యర్థులు పోటీలో కొనసాగినట్టయింది.

మరోవైపు, లెక్కించాల్సిన బ్యాలెట్‌ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్‌ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్‌ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్‌ కడప జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్‌ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులను సంప్రదించారు.

కాగా, పోలింగ్‌ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్‌ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది.

TDP: డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు.. పోలీసు విధులకు ఆటంకం.. టీడీపీ నేతలపై కేసు