AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి.. అమరావతి ఎకనామిక్ రీజియన్ తో భారీ వృద్ధికి ప్రణాళిక!

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, దాని చుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ ఒక భారీ ఆర్థిక మండలిని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) పేరుతో ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక స్వరూపాన్ని మార్చేందుకు ఏపీసీఆర్‌డీఏ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక రీజియన్ కేవలం అమరావతికి మాత్రమే పరిమితం కాకుండా..

Andhra Pradesh: ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి.. అమరావతి ఎకనామిక్ రీజియన్ తో భారీ వృద్ధికి ప్రణాళిక!
Amaravati Economic Region
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 05, 2026 | 10:22 AM

Share

రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని భారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) రూపకల్పన కోసం ఏపీసీఆర్‌డీఏ టెండర్లు పిలవడం ద్వారా ప్రణాళిక ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా అమరావతిని మాత్రమే కాకుండా పరిసర జిల్లాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

సమగ్ర ప్రణాళికకు తొలి అడుగు: 

AER కోసం వ్యూహాత్మక కన్సల్టెన్సీ ఎంపికకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను (RFP) ఆహ్వానించారు. నీతి ఆయోగ్ రూపొందించిన సిటీ ఎకనామిక్ రీజియన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ ప్రణాళికలో ప్రాంతీయ ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడి అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.

తొమ్మిది జిల్లాల విస్తీర్ణంలో భారీ రీజియన్:

అమరావతి ఎకనామిక్ రీజియన్ మొత్తం 44,962 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటవుతుంది. గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలను కలుపుకుని ఈ రీజియన్ రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సుమారు 35 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉండటం దీనికి బలంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

భూ సమీకరణతో అభివృద్ధి మోడల్:

పారిశ్రామిక అభివృద్ధి, గృహ నిర్మాణం కోసం అవసరమైన చోట్ల భూ సమీకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్ బ్యాంక్‌తో పాటు కొత్త భూముల గుర్తింపు, రీజినల్ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా భూమి వినియోగ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

మూడు దశల్లో అమలు:

ఈ రీజియన్ అభివృద్ధిని దశల వారీగా అమలు చేయనున్నారు. 0–12 నెలలు, 1–3 సంవత్సరాలు, 3–7 సంవత్సరాలు, 7–22 సంవత్సరాలుగా విభజించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా భారీ ఆర్థిక వృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యం.

మెట్రోపాలిటన్ మోడల్‌తో విస్తరణ:

మెట్రోపాలిటన్ రీజియన్, గ్రేటర్ రీజియన్ మోడల్‌ల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. సింగపూర్, టోక్యో, సియోల్ వంటి అంతర్జాతీయ నగరాల అనుభవాలను కూడా పరిశీలిస్తున్నారు. పారిశ్రామిక, ఆర్థిక కేంద్రాలుగా విభజన రీజియన్‌లో వివిధ ప్రాంతాలను ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. అమరావతి రాజధాని నగరంగా ఉంటే, విజయవాడ–గుంటూరు పారిశ్రామిక సేవల జంట నగరాలుగా ఎదుగుతాయి. ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలుగా మారుతాయి. ఒంగోలు–మార్కాపురం ప్రాంతాన్ని ఖనిజ ఉత్పత్తి కారిడార్‌గా అభివృద్ధి చేస్తారు.

పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ఊతం:

మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ ప్రాంతాలను ఓడరేవు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

భారీ ప్రాజెక్టులు, పెట్టుబడుల లక్ష్యం:

రీజియన్‌లో కనీసం ఎనిమిది ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు. వీటికి అంతర్జాతీయ బ్యాంకులు, పెట్టుబడిదారులను ఆకర్షించేలా బ్యాంకబుల్ ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలు సిద్ధం చేయనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా కీలకంగా మారనున్నాయి.

భవిష్యత్ రంగాలపై ఫోకస్:

ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రిక్ వాహన భాగాలు, ఫార్మా, టెక్స్‌టైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను కీలక వృద్ధి రంగాలుగా గుర్తించారు. జిల్లా వారీగా ఆర్థిక ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని గ్రోత్ కారిడార్లను అభివృద్ధి చేస్తారు.

పట్టణ విస్తరణకు ప్రాధాన్యం:

ప్రస్తుతం ఆదాయం ఎక్కువగా పట్టణాల నుంచే వస్తున్న నేపథ్యంలో పట్టణ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిశ్రమలతో పాటు గృహ నిర్మాణానికి అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తారు. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలపరిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

మొత్తంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ రూపకల్పనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us