AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కూతురు ఒక పెళ్లైన వ్యక్తితో ప్రేమాయనం నడుపుతుందని తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత తేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం పోలీసులకు తెలిస్తే ఏమవుతుందోనని భయపడి కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రకరించారు.. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయారు.

Andhra News:  ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
Ongole Crime
Fairoz Baig
| Edited By: Anand T|

Updated on: Jul 17, 2025 | 5:59 PM

Share

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కట్టు తప్పిన కన్నకూతుర్ని క్షణికావేశంలో తల్లిదండ్రులు గొంతునులిమి చంపేశారు. అనంతరం తేరుకున్న తల్లిదండ్రులు జరిగిన ఘోరానికి కన్నీటి పర్యంతమయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. అప్పటికే వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్న తమ కూతుర్ని మందలించినా ఫలితం లేకపోవడంతో ఆవేశంలో గొంతునులిమితే అది కాస్తా మరణానికి దారితీసిందని తల్లిదండ్రులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులోని జర్నలిస్ట్‌ కాలనీ 1వ లైన్‌లో కన్న కూతుర్ని తల్లిదండ్రులు గొంతునులిమి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 15వ తేదిన రాత్రి పది గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అనంతరం తమ కూతురు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసుల విచారణలో తామే కూతురి గొంతునులిమి హత్య చేసినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు ఒంగోలు తాలూకా సిఐ విజయ్‌కృష్ణ తెలిపారు.

పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయనం

ఒంగోలులో నివాసం ఉంటున్న పల్నాటి రమేష్‌, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి పెళ్ళి చేశారు. చిన్న కుమార్తె 23 ఏళ్ళ అనూష డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది. కొంతకాలంగా తల్లిదండ్రులతో కలిసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న ఓ పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడింది. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు అనూషను మందలించారు. పెళ్లైన వ్యక్తిని తమ కూతురి జోలికి రావద్దంటూ హెచ్చరించారు. అయినా అనూష అదే వ్యక్తిని తిరిగి కలుసుకుంటుందని తెలుసుకుని ఈనెల 15వ తేది రాత్రి 10 గంటల సమయంలో మందలించారు. ఈ క్రమంలో అనూషకు తల్లిదండ్రులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు క్షణికావేశానికి గురై అనూష గొంతు నులిమారు. ఈ పెనుగులాటలో అనూష ఊపిరి ఆగిపోయింది.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

కూతురు చనిపోవడంతో భయపడిపోయిన తల్లిదండ్రులు అనూష ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకున్నట్టు వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కూతురి మరణంపై తల్లిదండ్రులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తామే గొంతునులిమి తమ కూతురిని చంపినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నారని ఒంగోలు తాలూకా సిఐ విజయ్‌కృష్ణ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.