Vijayawada: గన్నవరం ఎయిర్ పోర్ట్ భూనిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
గన్నవరం ఎయిర్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెలలోనే 44 కోట్లు క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు ఏడేళ్లుగా పరిహారం కోసం ఫైట్ చేస్తున్న వారికి ముఖ్యమంత్రి నిర్ణయం ఊరట కలిగిస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. రన్ వే విస్తరణ కోసం 2016 లో అప్పటి టీడీపీ సర్కార్ భూములను సేకరించింది. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 5 గ్రామాలకు చెందిన 662 మంది రైతులు సుమారు 800 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించారు. కొంతమంది భూములతో పాటు ఇళ్లు సైతం కోల్పోయారు. అప్పట్లో ఎమ్మెల్యేగా వంశీ హామీ ఇవ్వడంతో భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఏడేళ్లయినా ఇప్పటికీ పరిహారం అందక పోవడంతో ధర్నాలు చేయడంతో పాటు కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు.
ఇదే విషయంపై గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు..వాస్తవంగా గత ప్రభుత్వం లోనే పరిహారం అందించాల్సి ఉందని.. కానీ పట్టించుకోలేదని ముఖ్యమంత్రికి వివరించారు వంశీ…నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.వచ్చే నెలలోనే పరిహారం కింద 44 కోట్లు చెల్లిద్దామని వంశీకి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.
ఇప్పటికే నిర్వాసితుల వివరాలు, అందించాల్సిన పరిహారం పై లెక్కలు రెడీ చేశారు అధికారులు. దీనికి అనుగుణంగా నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ పూర్తి హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2016లో చంద్రబాబు సర్కార్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించిందట. ఇప్పుడు వారికి వచ్చే నెల్లోనే నష్ట పరిహారం అందజేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో రైతులు ఊరట చెందారు.
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..
