AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం టెండర్లలో అక్రమాలు: తేల్చిన నిపుణుల కమిటీ

పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అందులో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్ట్ పనులు, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ నిపుణుల కమిటీ రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. అందులో గతంలో ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అంతేకాకుండా ఇప్పుడు పనులు పాత కాంట్రాక్టర్‌కే ఇస్తారో లేక […]

పోలవరం టెండర్లలో అక్రమాలు: తేల్చిన నిపుణుల కమిటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 12:15 PM

Share

పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడం, అందులో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్ట్ పనులు, డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ నిపుణుల కమిటీ రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. అందులో గతంలో ఇచ్చిన టెండర్లలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అంతేకాకుండా ఇప్పుడు పనులు పాత కాంట్రాక్టర్‌కే ఇస్తారో లేక కొత్త కాంట్రాక్టర్‌నే నియమిస్తారో త్వరగా తేల్చాలని కూడా ప్రభుత్వానికి సూచించింది కమిటీ. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

కాగా గతంలో టెండర్లు దక్కించుకున్న ఒరిజనల్ కాంట్రాక్టర్ ట్రాన్స్‌ ట్రాయ్ నుంచి అడ్వాన్స్ మొబలైజేషన్‌పై వడ్డీని రికవరీ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.2,346కోట్లు చెల్లించినట్లు తెలిపిన కమిటీ.. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొత్తం 787కోట్లకు రికవరీ చేయాలని కూడా చెప్పింది. అలాగే ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనుల్లో మళ్లీ టెండర్లకు వెళ్లాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం రద్దు కాకుండా కొత్త వారికి పనులు అప్పగించడంపై నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది.

ఇక పోలవరం కుడి, ఎడవ ప్రధాన కాలువ అంచనాలు భారీగా పెంచడాన్ని కమిటీ తప్పుపట్టింది. 2010లో 16వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ అంచనాలు 2018 నాటికి 55వేల కోట్లకు పెరగడంపై నిపుణుల కమిటీ ఆరా తీసింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ప్రాజెక్ట్‌తో సంబంధం లేకుండా విడిగా టెండర్లు పిలవడంపై కమిటీ పరిశీలన జరిపింది. పనులు ప్రారంభించకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారని తెలిపింది.

వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి లేకుండానే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని పెంచడాన్ని కూడా కమిటీ తప్పు పట్టింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రాజెక్ట్ పనుల్ని, విద్యుత్ కేంద్రాన్ని సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఒరిజనల్ కాంట్రాక్ట్ ఏజెన్సీ అయిన ట్రాన్స్ ట్రాయ్ ఆర్థిక ఇబ్బందులను అథారిటీ పరిశీలిస్తుందని.. పాత కాంట్రాక్టర్‌ను కొనసాగించడమా లేక కొత్తవారికి అప్పగించడమా అనే దానిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.