AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు చేదు స్మూతీ.. ప్రియురాలితో కాల్స్.. మెసేజ్‌లు డిలీట్.. ఎంతకు తెగించావ్‌రా దుర్మార్గుడా..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, కోట్లలో జీతం, నాలుగు నెలల క్రితమే పెళ్లి.. అంతా సజావుగా సాగిపోతుంది అనుకునేలోపే ఊహించని ఘోరం జరిగింది. భార్య బాత్రూమ్‌లో చనిపోయిందని భర్త పోలీసులకు ఫోన్ చేశాడు. అప్పుడు భర్త అమాయకుడని అంతా అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భార్యకు చేదు స్మూతీ.. ప్రియురాలితో కాల్స్.. మెసేజ్‌లు డిలీట్.. ఎంతకు తెగించావ్‌రా దుర్మార్గుడా..
Telugu Techie Arrested In Us For Allegedly Killing Wife
Krishna S
|

Updated on: Jul 10, 2026 | 11:18 AM

Share

అమెరికాలో గతేడాది సాధారణ మరణంగా భావించిన 27 ఏళ్ల వివాహిత మృతి కేసు ఊహించని మలుపులు తిరిగింది. పోలీసుల విచారణలో భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 4 నెలలకే తన భార్యను గొంతు నులిమి చంపిన ఆరోపణలపై తెలంగాణకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నెను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 2025 అక్టోబర్ 27న వాషింగ్టన్‌లో జరిగింది. మృతురాలిని రాజిత సబ్బినేనిగా గుర్తించారు.

బాత్‌రూమ్ డ్రామా ఆడిన భర్త

పోలీసుల విచారణ ప్రకారం… గతేడాది అక్టోబర్ 27న అవినాష్ 911 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశాడు. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి తన భార్య పొరపాటున బాత్‌రూమ్‌లో లోపల లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని నమ్మబలికాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది బాత్‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజితకు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు ప్రకటించారు.

కేసును మలుపు తిప్పిన పోస్ట్‌మార్టం..

మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో కథ అడ్డం తిరిగింది. రాజిత ఊపిరాడక మరణించినట్లు ఆ రిపోర్టులో తేలింది. దీంతో రంగంలోకి దిగిన డిటెక్టివ్‌లు అవినాష్ గుట్టు రట్టు చేశారు. ఇండియాలో ఉన్న ఒక మహిళతో అవినాష్‌కు ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. జూన్ 5, 2025న జరిగిన వీరి వివాహానికి సదరు మహిళ కూడా హాజరైనట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి తర్వాత రాజిత టెక్సాస్ నుండి సియాటిల్ ప్రాంతానికి కాపురం మారింది. అయినప్పటికీ అవినాష్ సదరు మహిళతో నిరంతరం టచ్‌లోనే ఉన్నాడు.

హత్య తర్వాత ప్రియురాలికి శవం ఫోటో షేర్..

రాజిత మరణించిన రోజున అవినాష్ సదరు మహిళకు కనీసం నాలుగు సార్లు కాల్స్ చేసినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. తాను బాత్‌రూమ్ తలుపు తీయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పిన సమయంలోనే ఆమెతో ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేకాకుండా హత్య చేసిన తర్వాత రాజిత మృతదేహానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆమెకు పంపినట్లు, ఆ తర్వాత ఆ మెసేజ్‌లను డిలీట్ చేసినట్లు అవినాష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

చేదు స్మూతీ రహస్యం..

ఈ కేసులో మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోవడానికి ముందు రాజిత తన భర్త ఇచ్చిన స్మూతీ గురించి ప్రస్తావించింది. ఆ స్మూతీ చాలా చేదుగా.. కఫ్ సిరప్ లాగా ఉందని ఆమె చనిపోయే రోజున అవినాష్‌కు మెసేజ్ చేసింది. ఈ వివరాలన్నీ ఆధారాలుగా చేసుకుని పోలీసులు అవినాష్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చారు. రాజిత అంత్యక్రియల ఏర్పాటులో సహాయం చేసిన స్థానిక తెలుగు అసోసియేషన్ వాలంటీర్లు ఈ విషయాలు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘‘అవినాష్ మాతో మాట్లాడినప్పుడు ఇది హత్య అని గానీ, అతనిపై అనుమానం ఉందని గానీ మాకు అస్సలు అనిపించలేదు. రజితకు ఆరోగ్యం బాగోలేదని, తను బయటకు వెళ్లి వచ్చేసరికి బాత్‌రూమ్‌లో పడిపోయిందని మాకు చెప్పాడు. భర్తగా ఆయనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. కానీ అసలు నిజం తెలిసి మేము షాక్ అయ్యాం’’ అని ఒక వాలంటీర్ తెలిపారు.

Follow Us