Turkey Earthquake: టర్కీని వెంటాడుతున్న భూకంపం.. గంటల వ్యవధిలోనే ఐదోసారి భారీ ప్రకంపనలు..

టర్కీలోని పది నగరాలపై భూకంప ప్రభావం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, గావుకేకలు. కన్నుమూసి తెరిచేలోగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. జరగాల్సిన నష్టం కళ్లముందే జరిగిపోతుంది.

Turkey Earthquake: టర్కీని వెంటాడుతున్న భూకంపం..  గంటల వ్యవధిలోనే ఐదోసారి భారీ ప్రకంపనలు..
Turkey Earthquake
Follow us

|

Updated on: Feb 07, 2023 | 6:25 PM

టర్కీని భూకంపాలు వెంటాడుతూ వణికిస్తున్నాయి. ఫిబ్రవరి 6న గంటల వ్యవధిలో మూడుసార్లు ఆ మర్నాడు రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. ఐదోసారి భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి భవనాలు నిలువునా కూలిపోతున్నాయి. శిథిలాల కిందపడి వేలాది మంది చిక్కుకుపోతున్నారు. ఒక్క టర్కీలోనే మృతుల సంఖ్య 4వేలు దాటిపోయింది. నిలువ నీడ కోల్పోయి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు వందసార్లకు పైగా భూమి కంపించింది. ఒకసారి భూకంపం వచ్చాక ఆ తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇళ్లల్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అక్కడి ప్రజలకు. దీంతో జనమంతా రోడ్లపైనే కనిపిస్తున్నారు. భూకంపం ధాటికి టర్కీలోని చాలా ప్రాంతాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. అందమైన భవనాలు, రహదారులు, విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చింది.

భూకంప దాటికి టర్కీలో దాదాపు 4వేల మందికి పైగా చనిపోయినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. అటు సిరియాలో మృతుల సంఖ్య 1500 దాటింది. రెండు దేశాల్లో కలిపి 5వేల మందికి పైగానే చనిపోయినట్టు తెలుస్తోంది. టర్కీలో 20వేలమందికి పైగా గాయపడగా.. 6వేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయని డిజాస్టర్‌, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకటించింది. క్షతగాత్రులకు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. బాధిత కుటుంబాలతో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. టర్కీలోని భూమి లోపల మానిటరింగ్ ప్యాట్రన్‌.. మ్యాపింగ్ ప్యాట్రన్‌ని సరిగా విశ్లేషించని కారణంగానే భూకంపాలు సంభవిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి.

భూకంపాల ధాటికి టర్కీలోని పలు నగరాల్లో అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగతున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భూకంపాల్లో వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలోని పది నగరాలపై భూకంప ప్రభావం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, గావుకేకలు. కన్నుమూసి తెరిచేలోగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. జరగాల్సిన నష్టం కళ్లముందే జరిగిపోతుంది. అయినవాళ్లను.. అన్నింటిని పోగొట్టుకుని వేలమంది అనాథల్లా రోడ్లపై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..