సొంత దేశంలోనే చుక్కలు చూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ‘రాజులు వద్దు’ అంటూ కదంతొక్కిన అమెరికా జనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నో కింగ్స్ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3,100 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నో కింగ్స్ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3,100 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు. లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యమవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలను వైట్హౌస్ కొట్టి పారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది.
శనివారం (మార్చి 28, 2026) నాడు, అమెరికా “రాజులు వద్దు” అనే పేరుతో భారీ నిరసనలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి. ఏఎన్ఐ కథనం ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రధాన నగరాల నుండి చిన్న పట్టణాలు, గ్రామాల వరకు, ప్రజలు కవాతు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిరసనలలో నినాదాలు చేయడం, పోస్టర్లు ప్రదర్శించడం, అనేక చోట్ల పాటలు పాడటం, డాన్సులు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ట్రంప్ సర్కార్కు నిరసన తెలిపారు.
న్యూయార్క్ నగరంలో, నిరసనకారులు మిడ్టౌన్ మాన్హాటన్ గుండా కవాతు చేస్తూ, వలస విధానం, ట్రంప్ పరిపాలన, ఇరాన్కు సంబంధించిన సమస్యలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో, నిరసనకారులు ఎంబార్కాడెరో ప్లాజా నుండి సివిక్ సెంటర్ ప్లాజా వరకు అమెరికన్ జెండాలతో పాటు, ఉక్రెయిన్, ట్రాన్స్జెండర్ హక్కులకు మద్దతు తెలిపే బ్యానర్లను పట్టుకుని కవాతు చేశారు. సెయింట్ పాల్లో ఒక భారీ ర్యాలీ జరిగింది, అక్కడ ప్రఖ్యాత గాయకుడు బ్రూస్ స్ప్రింగ్స్టీన్ ప్రదర్శన ఇచ్చారు. ఆయన మిన్నెసోటాను యావత్ దేశానికి స్ఫూర్తి అని పేర్కొంటూ, అక్కడి ప్రజల ధైర్యాన్ని ప్రశంసించారు. జనవరిలో వలస కార్యకలాపాల సమయంలో హత్యకు గురై, ఈ విషయంపై దేశవ్యాప్త చర్చకు దారితీసిన అలెక్స్ ప్రిట్టీ, రెనీ గూడ్లను కూడా ఆయన స్మరించుకున్నారు.
ప్రభుత్వ కఠిన విధానాలు ప్రజాగ్రహాన్ని పెంచాయని చెబుతూ, టిమ్ వాల్జ్ ఈ చర్యలను విమర్శించారు. ఇది ‘నో కింగ్స్’ నిరసనల మూడవ ప్రధాన దశ అని పేర్కొన్నారు. గతంలో కూడా లక్షలాది మంది ప్రజలను ఆకర్షిస్తూ నిరసనలు జరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్నాయని, ఈ నిరసనలకు కారణాలుగా పేర్కొంటున్నారు. వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ, నిరసన ప్రదర్శనలు చాలా వరకు శాంతియుతంగానే కొనసాగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
