First Tobacco-Free Nation: ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
దూమపానం.. ఇది మానవ ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా చాలా కుటుంబాలకు రోడ్డు పడ్డాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అదే మాల్దీవులు. నవంబర్ 1, 2025 నుండి మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటి పొగాకు రహిత దేశంగా అవతరించనుంది. ఇది తమ దేశానికి వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచి, భవిష్యత్తు తరాలను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

మాల్దీవులు పొగాకు రహిత సమాజాన్ని సృష్టించే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే ధూమపానాన్ని నిషేధించిన మొదటి దేశంగా మాల్దీవులు ఇప్పుడు అవతరించింది. నవంబర్ 1, 2025 నాటి కొత్త చట్టం ప్రకారం, జనవరి 1, 2007 తర్వాత జన్మించిన ఎవరూ పొగాకు ఉత్పత్తులను కొనడానికి లేదా ఉపయోగించడానికి వీళ్లేదు. ఇది కేవలం స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా అక్కడి వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాగా నేటి నుండి ఇది అమల్లోకి వచ్చింది.
ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడం, భవిష్యత్ తరాలను ధూమపానం నుండి రక్షించడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చట్టం అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఉత్పత్తులను దుకాణాల్లో ఎవరికైనా విక్రయించే ముందు.. వారు కచ్చితంగా వినియోగదారుల వయస్సును తెలుసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిషేధం ఇ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలను కూడా వర్తిస్తుందని తెలిపింది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరూ ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకోలేరు, విక్రయించలేరని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం యువతను పొగాకు సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారికి కఠినమైన శిక్ష విధించబడుతాయని పేర్కొంది. పొగాకు అమ్మే దుకాణాలు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను ఉల్లంఘిస్తే 50,000 మాల్దీవుల రుఫియా (సుమారు రూ. 2.9 లక్షలు) జరిమానా విధించవచ్చు. ఇ-సిగరెట్లు లేదా వేపింగ్ పరికరాలను ఉపయోగిస్తూ పట్టుబడిన వ్యక్తులకు 5,000 రుఫియా (సుమారు ₹ 29,000) జరిమానా విధించబడుతుంది.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మయిజ్జూ మాట్లాడుతూ.. మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పొగాకు వినియోగం ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారింది. దీని వల్ల ప్రతి సంవత్సరం 7 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మాల్దీవుల కొత్త విధానం “పొగాకు రహిత ఉత్పత్తి” నమూనాను అనుసరిస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




