ISRAEL WAR TECHNIQUE: ప్రపంచానికి ఆధునిక యుద్ధరీతుల్ని నేర్పిన ఇజ్రాయెల్ తంత్రం.. అధ్యయనం షురూ చేసిన అమెరికా
ఇటీవల ముగిసిన ఇజ్రాయెల్, పాలస్తీన ఉగ్ర ముఠా యుద్దపర్వం గుర్తుందా? దాదాపు పన్నెండు రోజుల పాటు ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాకు చెందిన హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ
ISRAEL WAR TECHNIQUE HOT TOPIC ACROSS THE WORLD: ఇటీవల ముగిసిన ఇజ్రాయెల్, పాలస్తీన ఉగ్ర ముఠా యుద్దపర్వం గుర్తుందా? దాదాపు పన్నెండు రోజుల పాటు ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాకు చెందిన హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మధ్య రాకెట్ దాడులు జరిగాయి. తొలుత ఓ మసీదు ఏరియాపై ఆంక్షలతో మొదలైన దాడుల పర్వం.. ఆ తర్వాత రాకెట్ బాంబర్ల వినియోగం దాకా.. ఉగ్రస్థావరాల పేల్చివేత దాకా వెళ్ళింది. అయితే.. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ యుద్దతంత్రంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ యుద్ద తంత్రంపై అమెరికా అధ్యయనానికి పూనుకోవడంతో సంచలనం రేపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పదుల సంఖ్యలో రాకెట్ బాంబర్లు తమ దేశం వైపు దూసుకు వస్తున్నా.. ఇజ్రాయెల్ సైన్యం కంగారు పడలేదు. సరికదా.. ఒక్కో రాకెట్ బాంబర్ను గురి చూసి మరీ కూల్చి వేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ సామర్థ్యాన్ని ఐరెన్ డోమ్గా పిలుస్తుండగా.. ఈ విధానంపై అమెరికా సహా పలు దేశాలు ఇపుడు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ‘ఆపరేషన్ గార్డియన్ ఆఫ్ ది వాల్స్’ పేరిట హమాస్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్వహించిన యుద్ధతంత్రం చరిత్రలోనే పెద్ద ముందడుగుగా పలు దేశాలు అభివర్ణిస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తిగా కృత్రిమ మేధపై ఆధారపడినట్లు తెలుస్తోంది. లక్ష్యాలను ఐడెంటిఫై చేయడం.. వాటిని టార్గెట్ చేయడం వంటి కీలక పనులన్నీ ప్రత్యేక అల్గారిథమ్స్తో కంప్యూటర్లే పూర్తిచేశాయి. చివరికి హమాస్ రహస్య టన్నెల్ నెట్వర్క్లను ధ్వంసం చేయడంలో కూడా వీటి పాత్ర చాలా ఉంది. ఒక రకంగా మిషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లే ఈ యుద్ధాన్ని శాసించాయి. ప్రపంచంలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వాడిన తొలి యుద్ధం ఇదేనని అమెరికా తదితర దేశాల మిలిటరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
హమాస్ ఉగ్రవాద సంస్థ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ ఏనాడో గుర్తించింది. కొన్ని సంవత్సరాల ముందు నుంచే రహస్యంగా శత్రువు ఊహకందని రీతిలో సిద్ధమైపోయింది. ఆ దేశానికి ప్రత్యేక ఇంటెలిజెన్స్ యూనిట్ ‘8200’ అల్కమిస్ట్’,‘గాస్పెల్’,‘డెప్త్ ఆఫ్ విజ్డమ్’ అనే స్పెషల్ అల్గారిథమ్స్, కోడింగ్లను తయారు చేసుకుంది. వీటికి ప్రత్యర్థులు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల సిగ్నల్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, జియోగ్రాఫికల్ ఇంటెలిజెన్స్ వంటి డేటాను సమీకరించారు. వీటిని క్రోఢీకరించి లక్ష్యాలను గుర్తించారు. డివిజెన్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న ‘గాస్పెల్’ అనే అల్గారిథం ఈ డేటాను విశ్లేషించి నమ్మకమైన లక్ష్యాలను గుర్తిస్తుంది. వాటిని ఇజ్రాయెల్ వాయుసేనకు అందిస్తుంది. ఇందు కోసం ఒక మల్టీ డిసిప్లైనరీ సెంటర్ను ఇజ్రాయెల్ మిలిటరీ ఏర్పాటు చేసుకుంది. ఇది గాజాలోని వందల కొద్దీ లక్ష్యాలను గుర్తించి ఇజ్రాయెల్ మిలిటరీకి ఇచ్చింది. దీంతో కచ్చితమైన లక్ష్యాలపై తగినంత సామర్థ్యంతో దాడిచేసేందుకు వీలు కలిగింది. వీటిల్లో హమాస్ రాకెట్ లాంఛర్లను భద్రపర్చిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా లక్ష్యాలను వెతుక్కుంటూ సుదీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం రాలేదు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలు, రాకెట్ లాంఛర్లు, రాకెట్ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, వారి మిలటరీ ఇంటెజెన్స్ ఆఫీస్లు, డ్రోన్లు, కమాండర్ల ఇళ్లు, హమాస్ నేవల్ కమాండో యూనిట్లు ఈ దాడుల్లో ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ గ్యాస్ క్షేత్రాలకు ముప్పు కల్గించే హమాస్ డ్రోన్ జలాంతర్గాములను భారీగా ధ్వంసం చేసింది.
ఇజ్రాయెల్ మిలిటరీ దళాల్లో యూనిట్ ‘9900’కు ప్రత్యేక స్థానం ఉంది. వీరు జియోగ్రాఫీ ఇంటెలిజెన్స్ను సేకరిస్తారు. ఉపగ్రహాల నుంచి వచ్చిన చిత్రాలను విశ్లేషించి.. ఆ ప్రదేశంలో జరిగిన మార్పులను అంటే నిర్మించిన కట్టడాలు, వాహనాల కదలికలను గుర్తించి మిలిటరీ అధికారులకు చేరవేస్తారు. దీంతో హమాస్ మోహరించిన రాకెట్ లాంఛర్లను ఇట్టే పసిగట్టింది ఇజ్రాయెల్ మిలిటరీ. ఒక స్కూలు పక్కనే మోహరించిన 14 రాకెట్ లాంఛర్లను ఇజ్రాయెల్ మిలిటరీ ఇట్టే గుర్తించింది. ఈ సారి చేసిన దాడుల్లో ఇజ్రయెల్ మిలిటరీ హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకత్వంపై గురిపెట్టింది. ఈ దాడుల్లో మొత్తం 150 మంది హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఆఫ్ పాలస్తీనా సంస్థల మిలిటెంట్లు చనిపోయారు. వీరిలో చాలా మంది అతిముఖ్యమైన, అరుదుగా రిక్రూట్ అయ్యే స్థాయి నేతలుండడంతో హమాస్కు తీరని నష్టం వాటిల్లిందని అంఛనా వేస్తున్నారు. ఒక దాడిలో బసీమ్ ఇసాను ఇజ్రాయెల్ దళాలు చంపాయి. అతను ఒక భవనం కింద ఉన్న సొరంగంలో ఉన్నాడు. దీని చుట్టూ 6 స్కూలు బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ, ఒక్క పౌరుడు కూడా మరణించకుండా ఐడీఎఫ్ ఆ భవనంపై దాడి చేసింది. అతడు గాజాసిటీ బ్రిగేడ్ కమాండర్. 2014 తర్వాత ఇజ్రాయెల్ చంపిన అతిపెద్ద హమాస్ నేత అతడు. అదే దాడిలో జొమ్మతాహిల్ అనే ఆయుధ తయారీ నిపుణుడు కూడా మరణిచాడు.
హమాస్ ఉగ్రవాద సంస్థకు ఉన్న అతిపెద్ద బలం సొరంగాల నెట్వర్క్. దీనిని ‘మెట్రో’గా పిలుచుకుంటారు. దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ రాత్రివేళల్లో రాకెట్ బాంబర్లు ప్రయోగించి విధ్వంసం చేసేసింది. దీనికోసం కొన్నేళ్లుగా గూఢచారుల నుంచి వచ్చిన సమాచారాన్ని సాంకేతికత సాయంతో విశ్లేషంచి వందల కిలోమీటర్ల మెట్రో మ్యాప్ను తయారు చేసింది. సొరంగం లోతు.. దానిపై ఉన్న నిర్మాణాల సమాచారం.. ఇలా ప్రతి ఒక్కటి ఇజ్రాయెల్ చేతికొచ్చాయి. ఈ దాడుల్లో మొత్తం సొరంగాలను ధ్వంసం చేయలేదని ఇజ్రాయెల్ అంగీకరించింది. కానీ, మళ్లీ వాటిని వినియోగించడానికి అవకాశం లేకుండా మాత్రం ధ్వంసం చేశామని చెబుతోంది. యుద్ధరంగంలో ఉన్న ఇజ్రాయెల్ మిలిటనీ దళాలను కాపాడే బాధ్యత యూనిట్ 8200 వద్ద ఉన్న ‘అల్కమిస్ట్’ అనే అల్గారిథమ్ చూసుకుంది. వివిధ మార్గాల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ క్షణాల్లో క్రోఢీకరించి మిలిటరీకి అందజేసింది. హమాస్, పీఐజీ దళాలు ఎక్కడ దాడి చేసే అవకాశం ఉందో గుర్తించి.. అక్కడి దళాలను అలర్ట్ చేశాయి. ఫలితంగా ఇజ్రాయెల్ దళాల వైపు ప్రాణనష్టం చాలా తక్కువ స్థాయిలో జరిగింది. 12 రోజుల యుద్ధంలో ఒమర్ తబీబీ అనే ఒక్క సైనికుడు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. యాంటీ ట్యాంక్ క్షిపణి వారి వైపు వస్తోందని హెచ్చరించారు. కానీ, అతడు ఆ దాడిలో మరణించాడు. ఇక ఐరన్డోమ్ పనితీరులో కూడా లక్ష్యాలను గుర్తించే కీలకమైన పనిమొత్తం ప్రత్యేక సాఫ్ట్వేర్లే చేశాయి. నవీన కాలంనాటి యుద్ధ విధానాల్లో డేటా ఎంత ముఖ్యమైనదో తాజాగా జరిగిన ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్దం చాటి చెబుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే ఆధునిక యుద్ధాల్లో డేటానే ప్రధాన ఇంధనమని యుద్ద నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: కంగారూలను కంగారెత్తిస్తున్న కొత్త సమస్య.. సాయం కోసం భారత్వైపు చూస్తున్న ఆస్ట్రేలియా