పాక్ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది
న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట పరిధి దాటి నిర్మించిన అక్రమ కట్టడాలను భారత అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు. వీసా విభాగం బయట రోడ్డుపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను కూల్చివేసారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి.

భారత్, పాకిస్తాన్కు మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూ నదీ జలాల్ని నిలిపివేసిన భారత్, దాయాది దేశంపై మరింత ఒత్తిడి పెంచింది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవనీ తీవ్రవాదాన్ని వదులుకుంటేనే తరువాతి చర్యలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. తాజాగా పాకిస్తాన్ దౌత్యపరంగా కవ్వింపు చర్యకు దిగడంతో ఇండియా దెబ్బకి దెబ్బ అంటూ గట్టి బదులిచ్చింది.
ఇటీవల శ్రీనగర్ కు వెళ్లిన భారత అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ను “భారత్లో అత్యంత ముఖ్యమైన భాగం” అని అభివర్ణించారు. అంతే కాకుండా కశ్మీర్లో శాంతిభద్రతల పరిస్థితిపై పొగడ్తలు కురిపించారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగం అని భారత అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్థాన్ షాకైంది. తీవ్ర అసహనంతో ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి నటాలీ బేకర్కు సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత అమెరికా రాయబారి కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇస్లామాబాద్ తీవ్ర ఆగ్రహం… దౌత్యవేత్తకు సమన్లు!
సెర్గియో గోర్ ప్రకటన వచ్చిన మరుక్షణమే పాకిస్తాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అమెరికా రాయబారి మాటలను తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్లోని అమెరికా దౌత్యవేత్తకు పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. అటు పాకిస్తాన్ ఆక్రోశం వెళ్లగక్కుతుండగానే, ఇటు న్యూఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి! న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ బయట పరిధి దాటి నిర్మించిన అక్రమ కట్టడాలను భారత అధికారులు జేసీబీల సాయంతో గురువారం తొలగించారు. వీసా విభాగం బయట రోడ్డుపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను కూల్చివేసారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయం బయట పాకిస్థాన్ అధికారులు బారికేడ్లను తొలగించిన సరిగ్గా మూడు రోజుల తర్వాత ఢిల్లీలోని పాక్ ఎంబసీ దగ్గర భారత అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. పాక్ ఘటనకు ప్రతీకారంగానే భారత్ ఢిల్లీలోని పాక్ ఎంబసీ వద్ద కూల్చివేతలు చేపట్టిందా అనే విషయం తెలియాల్సి ఉంది.