జైలు గోడల మధ్య భావోద్వేగం.. 9 నెలలకు భార్య, సోదరితో ఇమ్రాన్ ఖాన్ భేటీ !
అనేక కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ అయ్యారు. కాన్ఫరెన్స్ రూమ్లో ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీ, సోదరిని ప్రత్యేకంగా కలిసారు. 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' కథనం ప్రకారం.. దాదాపు 30 నిమిషాల పాటు వీరి మధ్య ముఖాముఖి సంభాషణ సాగింది. సుదీర్ఘ కాలం తర్వాత జైలు పరిసరాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు.

అనేక కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ తాజాగా భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ అయ్యారు. జైలు కాన్ఫరెన్స్ రూమ్లో ఇమ్రాన్ ఖాన్ వీరిని ప్రత్యేకంగా కలిసారు. ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం సుదీర్ఘ కాలం తర్వాత జైలు పరిసరాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. నోరీన్ నియాజీ తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్తో 15 నిమిషాల భేటీలో అతని ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించినట్లు తెలిసింది. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇమ్రాన్ను ‘షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్’ కు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి నోరీన్ నియాజీ ఆయనకు వివరించారు.
గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్ను ఎవరినీ కలవనివ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని అందరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆయన జైల్లో ప్రాణాలు కోల్పోయారంటూ పాక్ విలేకరి ఒకరు వ్యాఖ్యానించడంతో పీటీఐ పార్టీ నిరసనకు దిగింది. జైల్లో ఒంటరిగా ఉంచడం వల్ల ఆయన తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిటిషన్లను విచారించిన కోర్టు ఇక పై వారానికి ఒకసారి కుటుంబసభ్యులను కలవడానికి, కుమారులతో ఫోన్ లో మాట్లాడటానికి అవకాశం కల్పించింది. దాంతో ఇమ్రాన్ ఖాన్ ను ఆసుపత్రికి తరలించేందుకు చట్టపరమైన ప్రక్రియను జైలు అధికారులు ప్రారంభించారు.
రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు!
ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాకుండా జైలు అధికారులు గోప్యతను పాటించారు. దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన హెచ్చరిక! ఈ భేటీని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూస్తే.. ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా జారీ చేసిన ఉత్తర్వులను వాపసు తీసుకుంటామని హెచ్చరించడంతో ఇరువర్గాలు సమావేశ వివరాలను రహస్యంగా ఉంచినట్లు సమాచారం. అల్ ఖాదిర్ ట్రస్ట్ కు సంబంధించిన అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
పిల్లలతో భావోద్వేగ భేటీ!
అదే అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ తన పిల్లలు, వదినను కలిసారు. బుష్రా బీబీకి మొదటి వివాహం ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ను వివాహం చేసుకున్నారు.