AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఏఈ అణు ప్లాంట్‌పై భారీ డ్రోన్ దాడి.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు..!

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై మరోసారి భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి అనంతరం అబుదాబిలోని ప్రముఖ 'బరకా అణు విద్యుత్ కేంద్రం' వెలుపల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దాడి ఇరాన్‌కు చెందిన డ్రోన్ ద్వారానే జరిగి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు, స్థానిక అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.

యూఏఈ అణు ప్లాంట్‌పై భారీ డ్రోన్ దాడి.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు..!
Barakah Nuclear Plant In Abu Dhabi
Balaraju Goud
|

Updated on: May 17, 2026 | 4:50 PM

Share

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై మరోసారి భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి అనంతరం అబుదాబిలోని ప్రముఖ ‘బరకా అణు విద్యుత్ కేంద్రం’ వెలుపల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దాడి ఇరాన్‌కు చెందిన డ్రోన్ ద్వారానే జరిగి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు, స్థానిక అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అబుదాబి మీడియా కార్యాలయం కథనం ప్రకారం, అణు ప్లాంట్ వెలుపలి భద్రతా వలయం సమీపంలో, దాని ప్రాంగణంలో ఉన్న ఒక విద్యుత్ జనరేటర్‌కు ఈ దాడి కారణంగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, రేడియేషన్ లేదా అణు భద్రతకు సంబంధించిన ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు.

అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న బరకా అణు విద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అత్యంత వేగంగా అదుపులోకి తెచ్చాయి. ప్లాంట్ పూర్తిగా సురక్షితంగా ఉందని, అవసరమైన అన్ని రక్షణ చర్యలను తీసుకున్నామని ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (FANR) ప్రకటించింది. ప్లాంట్‌లోని అన్ని యూనిట్లు ప్రస్తుతం సాధారణంగానే పనిచేస్తున్నాయని, ఎలాంటి కీలక వ్యవస్థలకూ నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులను జనం నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇదిలావుంటే, ఈ దాడి కేవలం విడిగా జరిగిన ఘటన కాదు. గడిచిన ఫిబ్రవరి నెల నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య నడుస్తున్న తీవ్రమైన ఘర్షణల నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఫిబ్రవరి 28న ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి యూఏఈ నిరంతరం క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కొంటోంది. గతంలో కూడా ఇక్కడి ఇంధన కేంద్రాలు, సముద్ర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ తాజా దాడికి ఏ సంస్థా అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, ఉపయోగించిన డ్రోన్ల సరళిని బట్టి ఇది ఇరాన్ పనేనని యూఏఈ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడులు ప్రారంభించినప్పటి నుండి యూఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఘర్షణల్లో భాగంగా ఇరాన్ ఇప్పటివరకు యూఏఈపై 2,800కు పైగా డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. అమెరికా గత నెలలో దాడులను ఆపినప్పటికీ, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం ప్రారంభించింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ వ్యూహాత్మక ‘హోర్ముజ్ జలసంధి’పై తన కఠిన నియంత్రణను మరింత పెంచింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గానికి అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తారాస్థాయికి చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇరు దేశాలు ఒకరి ప్రతిపాదనలను మరొకరు తిరస్కరిస్తుండటంతో ప్రస్తుతానికి శాంతి స్థాపన అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us