ఇరాన్కు రష్యా సాయం..! పుతిన్ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..
మిడిల్ ఈస్ట్లో నిప్పు రాజేస్తున్న అమెరికా-ఇరాన్ వివాదంలో హఠాత్తుగా రష్యా పేరు తెరపైకి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల సమాచారాన్ని రష్యా తన శాటిలైట్ల ద్వారా సేకరించి.. ఇరాన్కు సీక్రెట్గా అందిస్తోందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాంబు పేల్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’ అని ట్రంప్ తెలిపారు. అయితే ఒకవేళ రష్యా నిజంగానే ఇరాన్కు సహాయం చేసినా.. దానికి పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. “ఇప్పటికే తాము ఇరాన్పై విరుచుకుపడి వారి బలాన్ని తీవ్రంగా దెబ్బతీశాం.. కాబట్టి ఆ సమాచారం వల్ల మాకేమీ పెద్ద నష్టం జరగలేదు’’ అని ట్రంప్ తెలిపారు.
జెలెన్స్కీ దగ్గర గట్టి ఆధారాలు..
అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా రష్యా వైఖరిని ఎండగట్టారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా శాటిలైట్ల ద్వారా నిఘా పెడుతుందని, ఆ సమాచారాన్ని ఇరాన్కు చేరవేస్తోందని ఆధారాలతో సహా సంచలన ఆరోపణలు చేశారు. ‘‘జూలై ప్రారంభం నుండి గల్ఫ్ ప్రాంతాలు, యూఎస్ మిలిటరీ బేస్లపై రష్యా శాటిలైట్ కదలికలను మేము రికార్డ్ చేశాం. ఆ శాటిలైట్ చిత్రాలు సరిగ్గా ఇరాన్ చేతికి చేరుతున్నాయి. దాడులకు ముందు, దాడుల సమయంలో, అలాగే దాడుల తర్వాత ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఇరాన్ ఈ రష్యన్ శాటిలైట్ చిత్రాలనే వాడుతుంది’’ అని ఆయన వివరించారు. ప్రత్యేకించి జూలై 19, 20 తేదీలలో బహ్రెయిన్లోని రెండు, జోర్డాన్, కువైట్లలోని ఒక్కో విమానాశ్రయంపై రష్యా శాటిలైట్లు ఎక్కువ దృష్టి పెట్టాయని, ఆ తర్వాతే వాటిపై ఇరాన్ దాడి ప్రణాళికలు రచించిందని జెలెన్స్కీ ఆధారాలను బయటపెట్టారు.
ప్రస్తుతం చర్చల దిశగా వాషింగ్టన్ – టెహ్రాన్
మరోవైపు రష్యా సహకారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, అమెరికా ప్రస్తుతం ఇరాన్తో దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యం ఇస్తోందని ట్రంప్ సూచించారు. అమెరికా జరిపిన భారీ దాడుల తర్వాత ఇరాన్ తీవ్రంగా దెబ్బతిని, స్వయంగా శాంతి చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘‘వాళ్లే చాలా మర్యాదగా వచ్చి.. దయచేసి దాడులు ఆపండి, మనం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని కోరారు. అందుకే ప్రస్తుతం మేము చర్చల దశలో ఉన్నాం. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మళ్లీ పాత పద్ధతిలోనే దాడులు మొదలవుతాయి’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
