AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ఒడిలోకి.. వైరస్‌తో బ్రిటన్ వ్యక్తి సుదీర్ఘ పోరాటం!

కోవిడ్ బారినపడిన వారు సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజుల్లోనే కోలుకుంటారు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం వైరస్ దీర్ఘకాలం..

10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ఒడిలోకి.. వైరస్‌తో బ్రిటన్ వ్యక్తి సుదీర్ఘ పోరాటం!
Corona Man
Ravi Kiran
|

Updated on: Jun 28, 2021 | 5:55 PM

Share

కోవిడ్ బారినపడిన వారు సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజుల్లోనే కోలుకుంటారు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం వైరస్ దీర్ఘకాలం ఉంటుందని వెల్లడవుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలలుగా కరోనా వైరస్‌తో పోరాడుతోంది. తాజాగా, ఆ రికార్డును మరో వ్యక్తి బద్దలు కొట్టారు. బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తిని కరోనా ఏకంగా 10 నెలలు పట్టిపీడించింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఆయన పలుసార్లు మరణం అంచులదాకా వెళ్లొచ్చారు. ఆయన చనిపోయారనుకుని కుటుంబసభ్యులు ఐదుసార్లు అంతిమ సంస్కారాలకూ ఏర్పాట్లు చేశారు. చివరకు కోవిడ్ కోరల నుంచి 310 రోజుల తర్వాత బయటపడ్డారు.

72 ఏళ్ళ డేవ్‌ స్మిత్‌ యాంటీబాడీ డ్రగ్‌ వల్ల సంపూర్ణంగా కోలుకున్నారు. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు కోవిడ్-19తో పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బ్రిస్టల్‌లో డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసే డేవ్‌కు ‘హైపర్‌ సెన్సిటివిటీ నిమోనైటిస్‌’ అనే సమస్య ఉంది. దీనివల్ల ఊపిరితిత్తుల కణజాలం ఇన్‌ఫ్లమేషన్ గురవుతుంది. దీనికితోడు ఆయన కేన్సర్ రోగి కావడంతో ఇన్‌ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యం దెబ్బతింది.

గతేడాది మేలో తొలిసారిగా కోవిడ్ నిర్ధారణ కాగా.. అప్పటి నుంచి మహమ్మారి అంటిపెట్టుకుంది. చికిత్స కోసం ఏడుసార్లు ఆసుపత్రిలో చేరగా.. పీసీఆర్‌ పరీక్షల్లో 43సార్లు పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మొదటిసారి ఆసుపత్రిలో చేరిన డేవ్‌కు వైద్యులు యాంటీ బయోటిక్స్‌‌తో చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. మళ్లీ వైరస్ తీవ్రం కావడంతో జూలైలో మరోసారి ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. వైరస్ ‘పాజిటివ్‌’ వచ్చింది. రెండోసారి ఆయన రీ-ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారని తొలుత వైద్యులు భావించారు.

అయితే, జన్యు పరీక్షల్లో మొదటి సోకిన ఇన్‌ఫెక్షన్‌ కొనసాగుతున్నట్లు తేలింది. గతేడాది అక్టోబరులో బ్రిస్టల్‌ యూనివర్సిటీ పరిశోధకులు డేవ్‌ నుంచి సేకరించిన రక్త నమూనా నుంచి వైరస్‌ను వృద్ధి చేయగలిగారు. దీని ఆధారంగా ఆయనలో ఉన్నది మృత కరోనా ఆర్‌ఎన్‌ఏ కాదని, సజీవ వైరస్‌ అని గుర్తించారు. ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆరోగ్యం విషమించింది. పాజిటివ్‌గా తేలిన ఏడు నెలల తర్వాత రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని వినియోగించారు. అయినా ఆయనలో వైరస్ లోడ్ ఏ మాత్రం తగ్గలేదు.

265వ రోజున ఆయనకు.. ల్యాబ్‌లో తయారుచేసిన యాంటీబాడీలతో కూడిన ఔషధాలను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. ఈ ఔషధానికి బ్రిటన్‌లో అనుమతి ఇంకా లభించకపోయినా మానవతా దృక్పథంతో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. యాంటీబాడీ ఔషధాలు ప్రారంభించిన 45 రోజుల తర్వాత ఆయనకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చింది. దీంతో డేవ్ సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి ఈ విషయం చెబుతున్నారు. ‘నేను ఇప్పుడు జీవిస్తున్న ప్రతి రోజూ నాకు బోనస్సే’ అని పేర్కొన్నారు.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి