LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? వార్తలో నిజమెంత?
ఎల్జీ టీవీలు యూజర్లు మాట్లాడే మాటలను సీక్రెట్గా రికార్డ్ చేసి ఆటోమేటిక్గా వేరే చోటుకి పంపుతున్నాయని.. యూట్యూబ్ ఛానెల్ 'గేమర్స్ నెక్సస్' సోషల్ మీడియాలో ఆరోపించడంతో ఆ వివాదం కాస్తా పెద్దదైంది. దీనిపై స్పందించిన దక్షిణ కొరియా దిగ్గజం.. ఎల్జీ స్మార్ట్ టీవీలపై వచ్చిన గూఢచర్య ఆరోపణలను ఎల్ జీ ఖండించింది. తమ స్మార్ట్ టీవీలు వినియోగదారుల మాటలను రహస్యంగా రికార్డ్ చేయవని స్పష్టం చేస్తూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయనే దానిపై ఎల్జీ క్లారిటీ ఇచ్చింది. రిమోట్లోని వాయిస్ లేదా ఏఐ బటన్ నొక్కినప్పుడు మాత్రమే మనం చెప్పేది టెక్స్ట్గా మారుతుందనీ క్లారిటీ ఇచ్చింది. మనం టీవీతో మాట్లాడటానికి వాడే ‘వేక్-వర్డ్’ (ఉదాహరణకు ‘హాయ్ ఎల్జీ’ లాంటివి) సరిగ్గా వినిపించిందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ అంతా ఆ టీవీలోనే జరుగుతుందనీ చెప్పుకొచ్చింది. వేక్-వర్డ్ గనుక తగలకపోతే.. ఆ ఆడియో ఎక్కడా రికార్డు కాదనీ టెక్స్ట్గా మారదనీ అలాగే వేరే సర్వర్లకు ట్రాన్స్ మిట్ కాదని ఎల్జీ స్పష్టం చేసింది. టెక్నాజీ పూర్తి సేఫ్ అనీ, తమ స్మార్ట్ టీవీలు ఎవరి మాటలను రహస్యంగా రికార్డు చేయడం లేదని కంపెనీ తేల్చిచెప్పింది.
వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాయిస్ రికగ్నిషన్ రిజల్ట్స్, టెక్నికల్ లాగ్లు జనరేట్ అవుతాయని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం మనం మాట్లాడే ఆ యాక్టివ్ టైమ్లో మాత్రమే పనిచేస్తాయని చెప్పింది. అంతేకాని, ఇంట్లో మనం ఎప్పుడూ మాట్లాడుకునే మాటలను టీవీ నిరంతరం రికార్డ్ చేస్తోందనడంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అంతేకాకుండా.. ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్, యాడ్స్ వంటి ఫీచర్లు అన్నీ ఆప్షనల్ మాత్రమేనని, మనం ఆన్ చేసుకుంటేనే అవి పనిచేస్తాయి తప్ప.. టీవీ ఆన్ చేసిన వెంటనే అవే బై-డిఫాల్ట్గా ఆన్ అయి ఉండవని ఎల్జీ తేల్చిచెప్పింది.
ఈ వివాదానికి అసలు కారణం గేమర్స్ నెక్సస్’ విడుదల చేసిన “216,000,000 స్పై టీవీస్” అనే వీడియో. ఎల్జీ టీవీలు స్టాండ్బై మోడ్లో అంటే టీవీ ఆఫ్ చేసి ఉండే మోడ్ లో ఉన్నప్పుడు కూడా మన మాటలను రహస్యంగా రికార్డ్ చేస్తాయనీ ఆ వీడియోలో ఆరోపించారు. అంతేకాకుండా.. మన ఐపీ అడ్రస్లు, లొకేషన్లు, చుట్టుపక్కల ఉండే వై-ఫై నెట్వర్క్ల వివరాలను కూడా సేకరించి వేరే సర్వర్లకు పంపుతున్నట్లు వీడియో చేసారు. ఆ ఆరోపణలన్నింటినీ ఎల్జీ సంస్థ కొట్టిపారేసింది, అన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పింది.
కస్టమర్ల ప్రైవసీని కాపాడటమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని ఎల్జీ క్లారిటీ ఇచ్చింది. గోప్యత, పారదర్శకత విషయంలో ఎప్పుడూ ముందుంటామని, వినియోగదారులు తమ టీవీ సెట్టింగ్స్లోకి వెళ్లి ఆప్షనల్ ఫీచర్లను ఎప్పుడైనా ఆన్/ఆఫ్ చేసుకోవచ్చని, లేదా తాము ఇచ్చిన పర్మిషన్ను ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. మొత్తానికి, ఎల్జీ టీవీలు మనుషులు ఇళ్లల్లో మాట్లాడుకునే మాటలను సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సౌత్ కొరియా దిగ్గజ సంస్థ క్లారిటీ ఇచ్చింది.