ఏం ఐడియా ఫ్రెండ్స్..! రైతు బర్త్ డే గిఫ్ట్గా యూరియా బస్తా.. వెరైటీ బహుమతితో అదరగొట్టిన స్నేహితులు..
ఫ్రెండ్ బర్త్డే అంటే చాలు.. యూత్ హంగామా చేస్తుంటారు. సరదా సరదాగా వారిని ఆటపట్టిస్తుంటారు. కేక్ కట్టింగ్, అదే కేక్ ముఖానికి రాసుకుంటూ అల్లరి చేస్తుంటారు. ఇక ఎవరికీ తోచిన గిఫ్ట్లు వారు ఇస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు బర్త్డేలు కూడా ఇట్టే వైరల్ అవుతున్నాయి. అయితే, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు బర్త్డే సందర్భంగా అతని స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. స్థానికులతో పాటుగా సోషల్ మీడియా వినియోగదారులు సైతం ప్రశంసలు కుమ్మరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన మారు కిషన్ రెడ్డి అనే రైతు 50వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు, తోటి రైతులు ఎవరూ ఊహించని రీతిలో యూరియా బస్తాను బహుమతిగా అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరతతో తమ లాంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా కొరత వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ తెలిసేలా ఇలా మిత్రునికి యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చామని స్నేహితులు చెబుతున్నారు. అధికారులు ఒక్కొక్కరికీ ఒక్క బస్తా ఇస్తుండటంతో, మరో బస్తా ఇస్తే మిత్రునికి సాయం చేసినట్లు అవుతుందని వారు తెలిపారు. యూరియా బస్తాతో సాయంత్రం పూట ఈ బర్త్ డే వేడుకలకు ముస్తాబు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇప్పుడు చాలా ప్రాంతాల్లో యూరియా కొరత కారణంగా..రైతులు ఇబ్బంది పడుతున్నారు. తోటి రైతుకి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ యూరియా బస్తాను ఇచ్చారు. యూరియా బస్తా ఇచ్చిన తరువాత కేక్ కట్ చేశారు..ఈ వేడుకను స్థానికులు ఎంతో ఆసక్తి గా తిలకించారు..ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన కిషన్ రెడ్డి స్నేహితులను అందరూ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




