Nalgonda: ప్రపంచంలోనే పడమర దిక్కుగా ఉన్న ఏకైక సూర్య దేవాలయం ఇదే.! ఎక్కడంటే
దేశంలో సూర్యదేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ఒడిశాలోని కోణార్క్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో సూర్య దేవాలయాలు. దేశంలోని అన్ని సూర్య దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఈ ఆలయం మాత్రం పడమర ముఖంగా ఉంది. ప్రపంచంలోనే పడమర దిక్కుగా ఉన్న ఏకైక సూర్య దేవాలయం ఎక్కడ ఉందో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రాచీన చారిత్రక సంపద,వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు చారిత్రక శిల్ప కళా సంపదకు నిలయంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో రాతి యుగ కాలపు నాటి ఆనవాళ్లు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. అంతటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గ్రామమే అడవిదేవులపల్లి. ఈ గ్రామాన్ని ఆలయాల గ్రామంగా పిలుస్తుంటారు. చారిత్రకంగా మన దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన నవబ్రహ్మ ఆలయాలు, బౌద్ధమగుళ్లు ఉన్నాయక్కడ.
పడమర దిక్కుగా సూర్య దేవాలయం..
సూర్య దేవాలయాలు అనగానే గుర్తుకు వచ్చేది మొదట ఒడిశాలోని కోణార్క్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో సూర్యదేవాలయాలు. అడవిదేవులపల్లిలోని సూర్య దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలోని అరుదైన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే.. దేశంలోని అన్ని సూర్యదేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇది మాత్రం పడమర ముఖంగా ఉంది. అంతే కాకుండా. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో సూర్య భగవానుడి పాదాల చెంత సూర్యకిరణాలు పడతాయి. ప్రతి రోజూ సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు చేస్తారు. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే.. ఇక్కడ శని దేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుగు తుంటాయి. తొలి ఏకాదశి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కృష్ణా నదిలో స్నానమాచరించి పూజలు చేస్తుంటారు. ప్రతి ఏటా చెన్నకేశవ స్వామి కల్యాణం వైభవంగా జరుగుతుంది.
ఎనిమిది వందల ఏళ్ల క్రితం..
క్రీ.శ.1213వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని కల్యాణ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్లదేవుడు పాలించేవాడు. ఆయన సామంత రాజుల్లో ఒకడైన ‘తొండయ చోడ”. ఆయన కృష్ణానది ఒడ్డున పార్వతి, శివుడు, విష్ణువు ఆలయాలు కట్టించాడు. అప్పట్లో ఆలయాల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రజల నుంచి పన్ను వసూలు చేసేవాళ్లు. అందులో ముఖ్యంగా కృష్ణానది దాటేందుకు పడవ ప్రయాణం చేసేవాళ్ల నుంచి ఏడు రూకల పేరుతో పన్నుగా వసూలు చేసేవాళ్లు. ఆ డబ్బును ఈ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఖర్చు చేసేవాళ్లు. ఆచార్య నాగార్జునుడు కూడా బౌద్ధమతాన్ని ఈ ప్రాంతం నుంచే వ్యాప్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమీప గ్రామాలైన చిట్యాల, ముది మాణిక్యంలో ఉన్న బౌద్ధ ఆరామాలు, గుహల్లో కనిపిస్తున్నాయి.
ఆలయాల గ్రామంగా పేరు..
అడవిదేవులపల్లి పేరుకు తగ్గట్టుగానే ఊళ్లో బోలెడు ఆలయాలు ఉన్నాయి. ఊరి చుట్టూ అడవి ఉంది. ఒకే చోట శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాల కలయిక చాలా అరుదుగా కనిపిస్తుంది. వాటితోపాటు ఇక్కడ బౌద్ధం కూడా విలసిల్లింది. ఈ ప్రాంతంలో శివ, పార్వతి, వినాయక, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర, రామలింగేశ్వర, ఆంజనేయ, చెన్నకేశవ, సూర్యనారాయణ, నాగేంద్ర స్వామి, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు పదో శతాబ్దంలో నిర్మించిన బౌద్ధమ గుళ్ళు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయాల్లో ఇప్పటికీ నిత్య ధూపదీపారాధనలు జరుగుతున్నాయి. త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి ఇక్కడ సర్పయాగం చేశాడట. అప్పుడు ఈ ప్రదేశంలోనే కాకాసురుడు అనే రాక్షసుడిని చంపాడని, అందుకే ఈ ప్రాంతంలో కాకులు కనిపించవని ప్రచారంలో ఉంది. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఆలయాల పరిరక్షణ బాధ్యత తీసుకొని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి