400 ఏళ్ల నాటి రహస్యాల నిలయం..! చెక్కతో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద అద్భుత రాజభవనం..
ఆధునిక ప్రపంచానికి దూరంగా, రాచరికపు వైభవాన్ని కళ్లకు కట్టే చారిత్రక కట్టడాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది, విలక్షణమైనది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, తక్కలై వద్ద కొలువై ఉన్న పద్మనాభపురం ప్యాలెస్. సుమారు 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ప్యాలెస్.. పూర్తిగా చెక్కతో నిర్మితమైన భారతదేశపు అతిపెద్ద రాజభవనంగా రికార్డు సృష్టించింది.

భారతదేశంలో రాతితో కాకుండా, ప్రధానంగా చెక్కతో నిర్మించిన ఒక రాజభవనం ఉంది. కేరళ, తమిళనాడు సరిహద్దులో, పశ్చిమ కనుమల పర్వత పాదాల వద్ద దాగి ఉన్న పద్మనాభపురం ప్యాలెస్, భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద చెక్క రాజభవన సముదాయం. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన ఈ రాజభవనం, ట్రావన్కోర్ రాజ్యానికి ప్రాచీన రాజధానిగా ఉండేది. దీనిలోని అద్భుతమైన శిల్పాలు, రహస్య మార్గాలు మరియు విశిష్టమైన వాస్తుశిల్పం మిమ్మల్ని తక్షణమే శతాబ్దాల నాటి రాజులు, చక్రవర్తుల యుగానికి తీసుకువెళ్తాయి.
కేరళ-తమిళనాడుల అరుదైన కలయిక:
భౌగోళికంగా ఈ ప్యాలెస్ తమిళనాడు రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ, దీని నియంత్రణ, నిర్వహణ బాధ్యతలన్నీ కేరళ ప్రభుత్వ పురావస్తు శాఖ చూసుకుంటుంది. పూర్వపు ట్రావెంకూర్ రాజవంశీయుల (వేనాడ్ సామ్రాజ్యం) మొదటి రాజధానిగా ఈ ప్రాంతం విలసిల్లింది. క్రీ.శ 1601 ప్రాంతంలో ప్రారంభమైన ఈ రాజభవన వైభవం, 1750లో మహారాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని భగవంతుడైన పద్మనాభస్వామికి అంకితం చేయడంతో, దీనికి పద్మనాభపురం (పద్మనాభస్వామి నివాసం) అనే పేరు స్థిరపడింది.
వాస్తు అద్భుతాలు – రహస్య సొరంగాలు:
ఈ ప్యాలెస్లోకి అడుగుపెట్టగానే అద్భుతమైన కేరళ సాంప్రదాయ వాస్తుశిల్పం (తచ్చుశాస్త్రం) మనల్ని ఆకట్టుకుంటుంది.
రాజమాత ప్యాలెస్: ఈ సముదాయంలోనే అత్యంత పురాతనమైన భాగం. చుట్టూ అద్భుతమైన చెక్క నక్కాషీ పనితనం కలిగిన సాంప్రదాయ ముంగిలి ఉంటుంది. అత్యవసర సమయాల్లో రాజులు సురక్షితంగా తప్పించుకోవడానికి ఇక్కడే ఒక రహస్య భూగర్భ సొరంగ మార్గాన్ని నిర్మించారు.
కింగ్స్ కౌన్సిల్ ఛాంబర్ (సభా మంటపం): రాజుగారి సమావేశ మందిరాన్ని ఎంతో శాస్త్రీయంగా డిజైన్ చేశారు. బయట ఎంతటి భానుడి భగభగలున్నా.. లోపలికి చల్లని గాలి వచ్చేలా చెక్కతో చేసిన ప్రత్యేక కిటికీలను అమర్చారు. దీనివల్ల లోపల ఎప్పుడూ ఏసీ లాంటి సహజ సిద్ధమైన చల్లదనం ఉంటుంది.
విశాలమైన డైనింగ్ హాల్: ట్రావెంకూర్ రాజుల ఉదారతకు ప్రతీకగా నిలిచే ఈ డైనింగ్ హాల్లో ఒకేసారి సుమారు 1,000 నుంచి 2,000 మంది కూర్చుని భోజనం చేసే వీలుంది.
పర్యాటక ఆకర్షణ: నల్లటి గ్రానైట్ నేలలు, శతాబ్దాల నాటి చైనా కుండీలు, పురాతన ఆయుధాలు, గోడలపై వేసిన అద్భుతమైన పెయింటింగ్స్ ఈ ప్యాలెస్ ప్రత్యేకతలు. కాల గమనంలో ఎన్నో శతాబ్దాలు దాటినా, చెక్కుచెదరని ఈ చెక్క ప్యాలెస్ నేటికీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. దక్షిణ భారతదేశ పర్యటనకు వెళ్లే హిస్టరీ లవర్స్, ఆర్కిటెక్చర్ ప్రియులు తప్పక సందర్శించాల్సిన పవిత్ర, చారిత్రక వారసత్వ ప్రదేశం ఈ పద్మనాభపురం ప్యాలెస్.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




