Warangal: ఫోన్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వరంగల్ నగరంలోని గరీబ్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సెల్ఫోన్ విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పాత ఫోన్ ఇవ్వాలన్న విషయమై జరిగిన గొడవలో అన్న ప్రవీణ్ కత్తితో తమ్ముడు ప్రసాద్పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ నగరంలోని 16వ డివిజన్ గరీబ్ నగర్లో దారుణం జరిగింది.. సెల్ ఫోన్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణాలు మింగేసింది.. అన్న చేతిలో తమ్ముడు హతమవ్వడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. గరీబ్ నగర్కు చెందిన ప్రవీణ్, ప్రసాద్ అన్నదమ్ములు.. ఇటీవల తమ్ముడు ప్రసాద్ కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నాడు.. ఈ క్రమంలో అన్న ప్రవీణ్ అతని పాత సెల్ ఫోన్ తనకు ఇవ్వాలని అడిగాడు.. ఈ విషయమై శనివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చి.. ఘర్షణగా మారింది..
అయితే.. గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో ఆ గొడవకు ఈ సెల్ ఫోన్ తగాదా తోడవడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది.. ఆవేశానికి లోనైన అన్న ప్రవీణ్, తమ్ముడు ప్రసాద్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో గరీబ్ నగర్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
