Revanth Reddy: సోమవారం నుంచే రేవంత్ పాదయాత్ర.. అక్కడి నుంచే స్టార్ట్.. రెండు నెలల పాటు కొనసాగే ఛాన్స్..
తెలంగాణలో పాదయాత్రల ట్రెండ్ నడుస్తోంది. నడిస్తే.. అధికారంలోకి వస్తామన్న దృఢ నమ్మకంతో పాదయాత్ర చేసేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్టీపీ...
తెలంగాణలో పాదయాత్రల ట్రెండ్ నడుస్తోంది. నడిస్తే.. అధికారంలోకి వస్తామన్న దృఢ నమ్మకంతో పాదయాత్ర చేసేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న రేవంత్రెడ్డి.. ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. తొలి రోజులో భాగంగా మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని అక్కడే బస చేస్తారు.
కాగా.. రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ నిర్వహణపై ఠాక్రే నేతృత్వంలో శనివారం గాంధీభవన్లో ముఖ్యనేతల సమావేశం జరిగింది. రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ, ఏఐసీసీ ప్రచార కమిటీల చైర్మన్లు మధుయాష్కీ గౌడ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6న ప్రారంభం కానున్న రేవంత్ పాదయాత్ర మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం