Etela Rajender: టీఆర్ఎస్ టార్గెట్‌గా ఈటల అడుగులు.. కొత్త పార్టీపై సమాలోచనలు.. ఆత్మగౌరవ పోరాట వేదికగా ప్రకటించే ఛాన్స్..!

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌పై పోరుకే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజమనిపిస్తున్నాయి.

Etela Rajender: టీఆర్ఎస్ టార్గెట్‌గా ఈటల అడుగులు.. కొత్త పార్టీపై సమాలోచనలు.. ఆత్మగౌరవ పోరాట వేదికగా ప్రకటించే ఛాన్స్..!
Follow us

|

Updated on: May 11, 2021 | 7:18 AM

Etela Rajender Political Future: తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావం దగ్గర నుంచి ఈటల పార్టీలో ముఖ్యమైన నేతగా, తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి మంత్రిగా కొనసాగిన ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో విచారణ ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. వెనువెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం అనేవి చకచకా జరిగిపోయాయి. అయితే, ఆయన తక్షణ కర్తవ్యం ఏంటన్నదీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌పై పోరుకే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తన వర్గీయులు, సన్నిహితులతో కొద్దిరోజులుగా చర్చలు జరిపిన ఈటల అధికార పార్టీపై పోరాటం సాగించాలన్న నిర్ణయానికే వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులలో మెజారిటీ నాయకులు ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపగా, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఉమతోపాటు నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి కూడా ఈటెలకు సంఘీభావం ప్రకటించారు.

మరోవైపు, ఇతర పార్టీల నేతలు సైతం గాలం వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే.. ఈటల మాత్రం ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టాలన్న అలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పాలు పంచుకున్న తన అనుయాయులు, స్నేహితులు కూడా సొంత పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరు సాగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ పార్టీని, ప్రభుత్వ విధానాలను, నేతల వైఖరిని తూర్పార పడుతూ ఓ పాటను ఈటల వర్గం విడుదల చేయడం గమనార్హం.

‘యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలరా.. సిద్ధమయి ఇక ఆత్మగౌరవ పోరు సల్పుదామా.. ఈటల రాజన్నతో ఇక జెండలెత్తుదామా.. దగాకోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా..’అంటూ సాగిన ఈ పాటను మానుకోట ప్రసాద్‌ రాయగా, రాంబాబు పాడాడు. ఈటల పట్ల ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన వైఖరిని తప్పు పడుతూ రాగయుక్తంగా ధ్వజమెత్తారు. ‘అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండ్రు.. ఆ స్వరం సైరన్‌కూత మీరిక తట్టుకోరు సూడూ.. గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరూ..’ అంటూ సాగిన ఈ పాటలో ‘ఎత్తుతున్నమూ ఈటలన్నతో పోరు జెండ మేము’అంటూ పరోక్షంగా పార్టీ పెట్టనున్న విషయాన్నీ తెలియజేశారు.

మరోవైపు, తన బలాన్ని నిరూపించుకోవడంలో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నారు. తన అనుచర గణాన్ని ఏకం చేసేందుకు ఆత్మగౌరవ పోరాటం నినాదంతో హుజూరాబాద్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌పై ప్రత్యేక్ష పోరాటానికి నాంది పలకాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. అదే సభా వేది క పైనుంచి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటన చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also… Bharat Biotech Covaxin: 14 రాష్ట్రాలకు నేరుగా కోవాగ్జిన్ డోసులు.. ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటెక్‌..!