Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్న్యూస్.. వాటిపై ట్యాక్స్ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!
Telangana Vehicle Reforms: రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఆర్సీకి సంబంధించిన మార్పులు చేయించుకోవడం.. ఇలా వాహనాలకు సంబంధించిన పనుల కోసం ఆర్టీవో ఆఫీస్ల చుట్టూ తిరిగే పనిలేకుండా .. ఈ సేవలన్నింటినీ డిజిటైలైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సమాన్యులు బ్రోకర్లకు డబ్బులు చెల్లించే భారం తగ్గనుంది.

రాష్ట్ర రవాణా వ్యవస్థ ఇప్పటివరకు స్థానికంగా నిర్వహించబడుతున్నప్పటికీ, ఈ నెల 23 నుంచి అది కేంద్ర ప్రభుత్వ వాహన్ నెట్వర్క్తో కలవనుంది. దీంతో తెలంగాణ వాహనాలన్నీ దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్లోకి చేరుతాయి. ఎక్కడైనా చెక్ చేసినా, ఎవరైనా కొనుగోలు చేసినా సమాచారం వెంటనే అందుబాటులో ఉంటుంది. ఈ మార్పుతో సాధారణ ప్రజలకు కలిగే లాభం ఏమిటంటే.. ఇప్పటి వరకు చిన్న పని కోసం కూడా ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండేది. ఇకపై ఆర్సీ డూప్లికేట్, అడ్రస్ మార్పు, పేరు మార్పు, లోన్ ఎంట్రీ లేదా తొలగింపు వంటివి ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది.
ఇదే సమయంలో వాహనదారులకు నిజమైన తీపి కబురు ఇచ్చే మరో నిర్ణయం కూడా అమల్లోకి రానుంది. రెండో వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటివరకు అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఈ అదనపు పన్నును పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహన్ వ్యవస్థ ప్రారంభమైన వెంటనే ఈ రూల్ కూడా అమల్లోకి రానుంది. దీంతో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గట్టి ఊరట లభిస్తుంది. ఉదాహరణకు పది లక్షల కారుపై సుమారు 20 వేల రూపాయలు ఆదా అవుతాయి. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు అవసరమయ్యే కుటుంబాలకు ఇది పెద్ద రిలీఫ్గా మారుతుంది.
మరో ముఖ్యమైన అంశం ఏమింటంటే ఈ డిజిటల్ మార్పులతో బ్రోకర్ల అవసరం తగ్గిపోతుంది. ప్రజలు నేరుగా ప్రభుత్వ సేవలను వినియోగించుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే రాష్ట్రం బయట వాహనం అమ్మినా, కొనినా, డాక్యుమెంటేషన్ చాలా వేగంగా పూర్తవుతుంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం టెక్నికల్ మార్పు కాదు. వాహనదారుల సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేసే పెద్ద రీఫార్మ్ అని చెప్పొచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
