Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. రైతుల అకౌంట్లోకి అప్పుడే..? లైన్ క్లియర్
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశముంది. ఈ నెల 13తో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. దీంతో ఆ తర్వాత వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారని తెలుస్తోంది.

తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ వచ్చింది.
రైతుల అకౌంట్లోకి అప్పుడే..
రాష్ట్రంలో ప్రస్తుతం మున్నిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేటితో ప్రచారానికి తెరపడగా.. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక 13వ తేదీన కౌంటింగ్ ముగియనుంది. దీంతో కౌంటింగ్ ముగియగానే వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధుల కోరత ఏర్పడింది. దీంతో బహిరంగ మార్కెట్లో నిధులను సమీకరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టకున్నారు. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ప్రభుత్వం రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు రైతులకు అందనున్నాయని చెప్పవచ్చు. ఒక్కొ ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయనుంది.
వేధిస్తున్న నిధుల కొరత
మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఇక మంత్రులు కార్పొరేషన్లలో మకాం వేసి తిరిగారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ నిధుల కొరత వల్ల జాప్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరిలో సంక్రాంతికి ముందు వీటిని ఇవ్వాల్సి ఉండగా.. శాటిలైట్ సర్వే వల్ల ఆలస్యమైంది. కానీ ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ పంట సాగవుతున్న భూములను శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ ఇప్పటికే వ్యవసాయశాఖకు అందింది. దాదాపు 10 శాతం భూముల్లో పంట సాగవ్వడం లేదని తేలినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
