Brs vs Bjp: పక్కా ప్రణాళికతో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ.. ఇద్దరు సీఎంలు హాజరయ్యే ఛాన్స్..!
ఇక మూడు రోజులే మిగిలి ఉంది.. దారులన్నీ అటు వైపు కదలాలి.. ఖమ్మం అంతా గులాబీ మయం కావాలి.. 18న జరిగే సభతో బీఆర్ఎస్ సత్తా చాటాలి. ఇదీ.. కారు పార్టీ వ్యూహం.

ఇక మూడు రోజులే మిగిలి ఉంది.. దారులన్నీ అటు వైపు కదలాలి.. ఖమ్మం అంతా గులాబీ మయం కావాలి.. 18న జరిగే సభతో బీఆర్ఎస్ సత్తా చాటాలి. ఇదీ.. కారు పార్టీ వ్యూహం. పక్కా ప్రణాళికతో సభ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ తొలుత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ పక్కన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ తొలి జాతీయ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రులు.. 18న జరిగే మీటింగ్ కోసం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
ఖమ్మంలోనే మకాం వేసిన మంత్రి హరీష్రావు భారీ జన సమీకరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందు వేదికగా బీఆర్ఎస్ పార్టీ మారే నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఛాన్స్ లేదన్న హరీష్రావు.. ఆ పార్టీలో చేరడం అంటే గోతి తవ్వుకోవడమేనని విమర్శించారు. బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లేనని చెప్పారు. సింగరేణి బొగ్గు గనులపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అలాగే సమన్వయంతో పనిచేసి ఇల్లందులో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంత చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టంగా ఉందని చెప్పారు మంత్రి హరీశ్రావు.
ఈ సభ ద్వారా బీజేపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. జాతీయ పార్టీగా విస్తరించిన మాకు ఢిల్లీ, హైదరాబాద్, ఖమ్మం.. దేశంలో ఏ మూల అయినా ఒక్కటే అంటున్నారు. కేసీఆర్ ఒకరిని చూసి నేర్చుకోరు, అతన్ని చూసే వేరే వాళ్లు ఫాలో అవుతారు. తాము గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తుంటే.. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వస్తున్నారంటూ జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు.




ఖమ్మం సభకు ఐదు లక్షల మందిని తరలించి బీఆర్ఎస్ సత్తా చాటాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నుంచి లక్షా 20 వేల మందిని తరలించాలన్నది తమ లక్ష్యమంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మన ఇంట్లో వేడుక ఉంటే ఎలా పరుగులు పెడుతూ పనిచేస్తామో.. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలంటూ కార్యకర్తలు, నేతలకు ఆమె పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే.. ఖమ్మం సభకు కేరళ, ఢిల్లీ సీఎంలతో పాటు యుపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుకాబోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




