Telangana: విద్యార్థుల డిమాండ్ తో ఎట్టకేలకు అక్కడికి కేటీఆర్.. మరో ఇద్దరు మంత్రులు కూడా..
విద్యార్థుల ఆందోళనలతో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమ క్యాంపస్ కు సీఏం కేసీఆర్ లేదా..
Telangana: విద్యార్థుల ఆందోళనలతో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమ క్యాంపస్ కు సీఏం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని పత్రికా ప్రకటనలు, ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. అయితే ఎట్టకేలకు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడనున్నారు మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి జైనద్ మండలం దీపాయిగూడ చేరుకుంటారు. అక్కడ మాతృ వియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆదిలాబాద్ లోని BDNT డాటా సొల్యూషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడతారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో సమావేశం అవుతారు. విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేస్తారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారు.
మద్యాహ్నం ఒంటిగంట సమయంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా బాసర ట్రిపుల్ ఐటీకి రానున్నారు. దాదాపు రెండు గంటల పాటు ముగ్గరు మంత్రులు ఇక్కడ ఉండనున్నారు. ఈఏడాది జూన్ లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజుల ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సీఏం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ తమ వద్దకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అప్పుడిచ్చిన హామీ మేరకు సోమవారం కేటీఆర్ క్యాంపస్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి కేటీర్ రాకతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..